బాహుబలి లేకపోతే ఆ సినిమా లేదు.. రాజమౌళి వల్లే నాకు ఆ ధైర్యం.. మణిరత్నం
దక్షిణాది సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) పేరు ముందుంటుంది. ఆయన తెరకెక్కించిన బాహుబలి (Baahubali) సిరీస్ తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభమైంది. తెలుగు సినిమా పరిధిని దాటి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా గర్వకారణంగా నిలిచింది. ఇక తాజాగా రాజమౌళి మరోసారి తన మాస్టర్పీస్ బాహుబలిని కొత్త రూపంలో బాహుబలి: ది ఎపిక్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ తరుణంలో ప్రముఖ లెజెండరీ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) స్వయంగా రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి మళ్లీ పెద్ద తెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. 2015లో బాహుబలి: ది బిగినింగ్, 2017లో బాహుబలి: ది కన్క్లూజన్ సినిమాలు కలిపి రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమా చరిత్రను తిరగరాశాయి. భారీ స్థాయిలో కథలు చెబుతూ భావోద్వేగాలను అద్భుతంగా మేళవించిన జక్కన్న టేకింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

దీంతో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు కూడా ఆయన ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు. బాహుబలి సిరీస్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకుంది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి.బాహుబలి విజయంతో తెలుగు సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా కూడా పాన్ ఇండియా హద్దులను దాటి కొత్త స్థాయికి చేరుకుంది. భాషా బేధాలు, రాష్ట్ర పరిమితులు అన్నింటినీ చెరిపేసిన ఈ చిత్రం తర్వాతే కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వం వంటి భారీ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయి.
ఇప్పుడు ఈ రెండు భాగాలను మిళితం చేసి, "బాహుబలి: ది ఎపిక్" పేరుతో కొత్త వెర్షన్గా రీ-రిలీజ్ చేశారు. రెండు భాగాల మొత్తం 5 గంటల నిడివిని రాజమౌళి ప్రత్యేక ఎడిటింగ్తో 3 గంటల 43 నిమిషాలకు కుదించి,సోర్టీ లైన్ మిస్ కాకుండా కొన్ని సీన్స్ను తొలగించి కొత్త కట్ అందించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ రీ-ఎడిట్ వెర్షన్లో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ పేస్ ప్రేక్షకులను మరోసారి బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ప్రస్తుతం "బాహుబలి: ది ఎపిక్" కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. భారత్తో పాటు యూఎస్ఏ, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని, మళ్లీ బాహుబలి ఫీవర్ మొదలైందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకులు మణిరత్నం వ్యాఖ్యలు రాజమౌళి ప్రాధాన్యాన్ని మరొకసారి నిరూపిస్తున్నాయి. ఓ ఇంటర్య్వూలో మణిరత్నం మాట్లాడుతూ "రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే పొన్నియన్ సెల్వం తీయగలమనే ధైర్యం వచ్చింది. చాలా సంవత్సరాలుగా ఆ కథను తెరపైకి తీసుకురావాలని అనుకున్నాను. కానీ, ఇంత పెద్ద కథను ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే భయం ఉండేది. అప్పుడే బాహుబలి వచ్చింది. ఆ సినిమా రెండు భాగాలుగా రూపొందించి దేశవ్యాప్తంగా ప్రజల ప్రేమను గెలుచుకుంది. అప్పుడే నాకు తెలిసింది పెద్ద కథలను ఇలా కూడా చెబుతారుగా అని. నిజం చెప్పాలంటే బాహుబలి లేకపోతే పొన్నియన్ సెల్వం అసాధ్యం" అని అన్నారు. ఈ వీడియో పాతదైనా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజమౌళి కేవలం దర్శకుడు కాదు, భారతీయ సినిమాకు కొత్త దిశ చూపించిన మార్గదర్శి అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











