రాజకీయం చేయకండి.. కొత్త జిల్లాలపై వైఎస్ జగన్ ప్రభుత్వానికి బాలకృష్ణ సరికొత్త డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇప్పుడు అన్ని వర్గాల్లోను చర్చకు తెరలేపింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేయడం ఆ తర్వాత సలహాలు, సూచనలు, కొన్ని జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం తమ జీవోలను సవరించే ప్రయత్నంలో పడింది. ఇలాంటి క్రమంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఆయన ఓ వీడియోను రిలీజ్ చేసి ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు విసిరారు. ఆ వీడియోలో బాలకృష్ణ ఏం చెప్పారంటే..

ఆందోళనలు, రకరకాల చర్చకు
ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయడం రకరకాల చర్చకు, ఆందోళనలకు దారి తీస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో సరికొత్తగా ఆకాంక్షలు, డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమాలకు సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను మరో జిల్లా పరిధిలోకి తీసుకురావడంపై కొన్నిచోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై హర్షం
ఇదిలా ఉండగా, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దమవుతూ విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటనలు కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ శతదినోత్సవ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయడం అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఆయన ఆశయాలు, స్పూర్తిని మరోసారి తెలియజెప్పే అవకాశం లభించందని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు.

హిందూపురంను జిల్లా చేయాలి అంటూ
ఏపీలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఓ వీడియో రిలీజ్ చేసి.. అధికార వికేంద్రికరణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. హామీ ఇచ్చిన విధంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను కేంద్రాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో హిందూపురం వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ది సాధించింది అని బాలకృష్ణ అన్నారు.

హిందూపురంను శ్రీ సత్యసాయి జిల్లాగా
అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో అగ్రస్థానంలో ఉన్న హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా ప్రకటించాలి. ఈ జిల్లా పేరును శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలి. హిందూపురం పట్టణంలోని కార్యాలయాల ఏర్పాటుకు, భవిష్యత్ అవసరాలు కోసం పుష్కలంగా భూమి ఉంది. జిల్లా ఏర్పాటులో రాజకీయం చేయకండి. హిందూపురం ప్రజల మనోభావాలను గౌరవించి, హిందూపురాన్ని జిల్లాగా చేయాలనే వారి చిరకాల కోరికను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అని బాలకృష్ణ సూచించారు.

గెజిట్స్ మార్పులు, చేర్పులు చేపడుతున్న అధికారులు
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరుసగా 26 జిల్లాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ తీసుకొన్న నిర్ణయానికి స్థానికులకు ఎలాంటి అభ్యంతరాలు ఉంటే.. లేదా సూచనలు చేయాలనుకుంటే.. గెజిట్ విడుదలైన 30 రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలి ప్రభుత్వం సూచించింది. అయితే ప్రజల డిమాండ్ మేరకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పేర్లకు సంబంధించి మంగళవారం రాత్రి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, ఆ తర్వాత జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో పేర్కొన్న దానికీ స్వల్ప తేడాలు కనిపించాయి.


Click it and Unblock the Notifications











