పవన్ కల్యాణ్ను సీఎం చేస్తావా? ప్రధాని మోడీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ పోస్ట్
ఒకప్పుడు ఆప్త మిత్రులుగా మెలిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీనటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. బీజేపీ పాలసీ, ప్రధాని నరేంద్రమోడీ విధానాలకు బద్ధ వ్యతిరేకి అయిన ప్రకాష్ రాజ్.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో పవన్ కళ్యాణ్ చేరడాన్ని తొలి నుంచి విమర్శిస్తున్నారు. బీజేపీ తీసుకునే నిర్ణయాలను విమర్శించే ప్రకాష్ రాజ్.. ఆ పార్టీకి మద్ధతిచ్చే ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. ఈ క్రమంలోనే తన మిత్రుడైన పవన్ కళ్యాణ్పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ రెచ్చిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
30 రోజులు జైళ్లో ఉంటే పదవి గోవిందా
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా సరే అవినీతి కేసులలో 30 రోజులకు మించి జైలు జీవితం గడిపితే వారి పదవులు ఆటోమేటిగ్గా పోతాయి. తీవ్రమైన నేరారోపణతో కనీసం ఐదేళ్లు జైలు శిక్షపడే నేరంలో ఈ నిబంధన వర్తిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిని తొలుత జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు.. ఈ బిల్లుపై ఉభయసభలలో చర్చించి సవరణలు చేయనున్నారు.

జైలు నుంచి పాలన ఉండదన్న మోడీ
అయితే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రధాని నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. అవినీతి అక్రమాల కేసులో ఓ ప్రభుత్వోద్యోగి 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ అవినీతి చేసిన రాజకీయ నాయకులకు ఎందుకు ఈ నిబంధన వర్తించదని ప్రధాన మంత్రి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడితే ఎవరైనా సరే గద్దె దిగాల్సిందేనని నరేంద్ర మోడీ తేల్చేశారు. కొందరు ముఖ్యమంత్రులు జైళ్లో నుంచే పరిపాలన చేసేవారని, జైల్లోనే ఫైళ్లపై సంతకాలు చేసేవారని.. ఇకపై ఇలాంటి జైలు పాలన ఉండదని ప్రధాని స్పష్టం చేశారు.
బిల్లుపై ఇండియా కూటమి అభ్యంతరాలు
ఇండియా కూటమిలో చాలా మంది జైల్లో ఉండటమో లేదంటే బెయిల్పై ఉండటమో ఉంది అందుకే వారంతా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నారని మోడీ మండిపడ్డారు. తప్పు చేసిన, అవినీతికి పాల్పడిన ఎవరూ తప్పించుకోలేరని ప్రధాని తేల్చిచెప్పారు. అయితే విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులపై ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి విభాగాల సాయంతో దాడులు చేయించి ఆయా ప్రభుత్వాలను కబ్జా చేయడానికే కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది.
బిల్లుపై ప్రకాష్ రాజ్ ట్వీట్
ఈ క్రమంలోనే తాజా బిల్లుపై ప్రకాష్ రాజ్ స్పందించారు. దీనిని కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేందుకు వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఈ బిల్లును అన్వయిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లుగా ఉంది. 'ఒక చిలిపి సందేహం.. మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, "మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని" ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ???' అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
చంద్రబాబు, జగన్లపై కేసులు
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక కేసులు నమోదై కోర్టులలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బెయిల్పైనే ఉన్నారు. అటు సీఎం చంద్రబాబు నాయుడుపైనా పలు కేసులు ఉండగా, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుతో జగన్, చంద్రబాబులకు ఏమైనా ఇబ్బందులు ఎదురుకావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎలాంటి మచ్చ లేదు, జైలు జీవితం గడపలేదు.. పైగా మోడీకి ప్రధాన మద్ధతుదారుడు. ఈ క్రమంలోనే పవన్ను సీఎం చేస్తారా? అనే అర్ధం వచ్చేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్, కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










