మహేష్ బాబుని ఏ రోజూ సహాయం అడగలేదు.. సుధీర్ బాబు ఎమోషనల్
Sudheer Babu - Mahesh Babu: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సుధీర్ బాబు 'జటాధర'అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగిన 'జటాధర' ప్రీ రిలీజ్ ఈవెంట్ సుధీర్ బాబుకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రేక్షకులను మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ హృదయాలను కూడా హత్తుకున్నాయి.ముఖ్యం సూపర్ స్టార్ మహేశ్ బాబుపై చేసిన కామెంట్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
'జటాధర' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Jatadhara Pre Release Event) శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్బంగా సుధీర్ బాబు మాట్లాడుతూ తన సినీ ప్రయాణంలోని భావోద్వేగాలను పంచుకున్నారు."సుధీర్ బాబు అంటే ఎవరు? అని నేనే నాకు ప్రశ్నించుకునే సందర్భాలు చాలానే వచ్చాయి. అవును, నేను కృష్ణగారికి అల్లుడు, మహేశ్ బాబుకి బావ. అది గర్వకారణమే అయినా, అదే సమయంలో ఓ పెద్ద బాధ్యత కూడా. నటుడిగా మారాలనే కోరిక ఒక దశలో అణచివేయాలని అనిపించింది కానీ ఆగలేకపోయా. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఆడిషన్స్ ఇచ్చాను. మొదట బాగానే మాట్లాడి, కాఫీ ఇచ్చి చివరికి 'నో' చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి" అని గుర్తుచేసుకున్నారు.

సుధీర్ బాబు ఇంకా మాట్లాడుతూ.. "కృష్ణానగర్లో కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిల్మ్నగర్లోని బాధలు నాకు బాగా తెలుసు. బస్సుల్లో తిరగకపోయినా, కారులో కూర్చొని బాధపడటం నాకు తెలుసు. ఈ మాటలు నేను సానుభూతి కోసం చెప్పడం లేదు. నా మొదటి సినిమాకే ఇలా చెప్పి ఉండేవాడిని, కానీ ఇది నా నిజ జీవిత ప్రయాణం" అని చెప్పారు.స్టార్ హీరో మహేశ్ బాబు బావ, సూపర్ స్టార్ కృష్ణగారి అల్లుడు అనే పెద్ద గుర్తింపు ఉన్నప్పటికీ, తన కెరీర్ను మాత్రం ఎప్పుడూ బంధుత్వం లేదా సిఫార్సులపై ఆధారపడకుండా నిర్మించుకున్నానని ఆయన స్పష్టంగా తెలిపారు.
అలాగే..సుధీర్ బాబు తన కెరీర్ గురించి మాట్లాడుతూ, "ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకున్నా. కానీ ఈ రోజు 20 సినిమాలు చేశా. అందులో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. అన్నింటికీ బాధ్యుడిని నేనే. మొదటి సినిమాకే 'వాయిస్ బాగోలేదు' అన్నారు. ఆ తర్వాత ప్రతిరోజూ గంటపాటు వాయిస్ ట్రైనింగ్ తీసుకున్నా. తర్వాత 'బాడీ చూపిస్తాడు' అన్నారు, అందుకే 'సమ్మోహనం' చేశా. అప్పుడు 'సాఫ్ట్ సినిమాలకు మాత్రమే సెట్ అవుతాడు' అన్నారు. అందుకే 'వి' చేశా. 'అర్బన్ స్టోరీలు మాత్రమే చేస్తాడు' అన్నారు, అందుకే 'శ్రీదేవి సోడా సెంటర్' చేశా. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటా," అని అన్నారు.
అదే సమయంలో సుధీర్ బాబు తన బంధుత్వం గురించి స్పష్టమైన మాటలు చెప్పారు. "నాకో పాత్ర గానీ, సినిమా గానీ రికమెండ్ చేయమని మహేశ్ బాబుని ఎప్పుడూ అడగలేదు. ఏ నిర్మాత దగ్గరా ఒక్క రూపాయి ఎక్కువ అడగలేదు. ఏ దర్శకుడినీ 'ఈ ఫైట్ పెట్టండి, ఆ పాట పెట్టండి' అని చెప్పలేదు. నాకు అవకాశం విలువేంటో తెలుసు. నా దగ్గర ఉన్న ఏకైక ప్రయోజనం కృష్ణగారి అల్లుడు, మహేశ్ బాబుకు బావ అనేది మాత్రమే.అవకాశం ఉన్న మహేష్ బాబును ఏ రోజూ సహాయం ఆగలేదు. కానీ ఆ గుర్తింపుతోనే 20 సినిమాలు చేశాను. ఎవరూ సహాయం చేయకపోయినా, ఆ నమ్మకమే నాకు తోడైంది," అని అన్నారు.
ఇదెలా ఉంటే.. 'జటాధర' చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ నటి సొనాక్షి సిన్హా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ ఈవెంట్లో సుధీర్ బాబు ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Click it and Unblock the Notifications











