యాంకర్ సుమని ఇరికించిన నాగవంశీ.... ఈసారి నన్ను తిట్టాలంటే
సినిమా హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో నెగిటివ్ ట్రోలింగ్ అనేది ఎక్కువైంది. బాగున్న సినిమాలను బాలేదని ప్రచారం చేయడంతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ బడా నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీపై ఇటీవల ట్రోలింగ్ ఎక్కువైంది. దీనిని ఖండిస్తూ వచ్చిన నాగవంశీ ఈసారి మాత్రం గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
ట్రోలర్స్కి టార్గెట్గా నాగవంశీ
సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్తో టాలీవుడ్లో బడా నిర్మాతల్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఏడాదికి ఖచ్చితంగా నాలుగైదు సినిమాలు తమ బ్యానర్లో ఉండేలా చూసుకుంటున్నారు. సినిమా విజయం సాధించడం అనేది ఎన్నో రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సినిమాకు నష్టం వచ్చినా, లాభం వచ్చినా దాని ప్రభావం పడేది అంతిమంగా నిర్మాతపైనే. ఎంతటి బడా ప్రొడ్యూసర్ అయినప్పటికీ వరుసగా నష్టాలు వస్తే కష్టమే.. దీనికి తోడు సూటిపోటి మాటలు కూడా పడాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు నాగవంశీ.

నాగవంశీకి వార్ 2తో భారీ నష్టాలు
ఇటీవల యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మాతగా బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్లు నటించిన వార్ 2ని తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజాం హక్కులను ఏకంగా 90 కోట్లు (జీఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే వార్ 2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దాంతో నాగవంశీకి సైతం భారీ నష్టాలు తప్పలేదు. వార్ 2 రిజల్ట్ కారణంగా నాగవంశీ పీకల్లోతు ఆర్ధిక సమస్యల్లో పోయారని, ఆస్తులు అమ్మేసి దుబాయ్కి పారిపోయారంటూ చిత్రసీమలో పుకార్లు హల్చల్ చేశాయి. అంతేకాదు... ఇకపై ఆయన సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ చేయరంటూ విస్తృతంగా కథనాలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే స్పష్టత ఇచ్చారు నాగవంశీ.. తాజాగా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మరోసారి తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు.
ఏం మాట్లాడినా తిడుతున్నారు
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రవితేజ, శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీరు సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారని నాగవంశీని యాంకర్ సుమ ఫన్నీగా అడుగుతుంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ ఈ అరుపులకు ఎగ్జయిట్ అయ్యి ఒకసారి మాట్లాడితే ఏం జరిగిందో ఒకసారి చూశారు కదా, ఈ స్పీచ్లు అచ్చిరాలేదు. రవితేజ గారి సినిమాలలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా మాస్ జాతరలో ఉంటాయన్నారు. అయితే సూపర్ ఫైట్స్ ఉంటాయా అని సుమ అడగ్గా.. సూపర్, బంపర్ వంటి ఎలిమెంట్స్ అన్నీ అంటే రేపు మళ్లీ నన్ను ఏసుకుంటారు. థియేటర్లో చూసి బాగుందని వాళ్లే మెసేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఈసారి కొంచెం పాజిటివ్గానే చెబుతారని నాకు నమ్మకంగా ఉంది. అందుకే నేనేం మాట్లాడటం లేదు.. వాళ్ల దగ్గర విందామని అంటారు వంశీ.
ఈసారి దుబాయ్ వెళ్లను
దాంతో మీ బదులు నేను చెబుతున్నానని... ఈ సినిమాలో కామెడీ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కావాల్సినంత మాస్ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, 31 అక్టోబర్ నాడు థియేటర్లో ఉంటుంది సినిమా చూసేద్దాం మాస్ జాతర అన్నారు సుమ. దానికి మాత్రం సుమ గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాడుకోండి తిట్టాలంటేనని నాగవంశీ పేర్కొన్నారు. మీకు తిట్టాల్సిన అవసరం రాదనే అనుకుంటున్నా.. మరీ ధైర్యంగా చెబితే మళ్లీ ఏం తిడతారోనని చెప్పలేకపోతున్నా. కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైతే మీకు నచ్చాయో అవన్నీ సినిమాలో ఉన్నాయి.. మిమ్మల్ని ఎక్కడా డిజప్పాయింట్ చేయం, ఈసారి ఏం జరిగినా దుబాయ్ మాత్రం వెళ్లడం లేదు టెన్షన్ పడకండి అంటూ నాగవంశీ ముగించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











