ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగులు బంద్.. టాలీవుడ్ నిర్మాతలు సంచలన నిర్ణయం
కరోనావైరస్ పరిస్థితులు, వరుస లాక్డౌన్లతో తెలుగు సినిమా పరిశ్రమ కుదేల్ అయింది. నిర్మాతలకు ఆర్థిక భారం తడిసి మోపెడు అవ్వడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. దాంతో సినిమా పరిశ్రమ ఎన్నడూ చూడనటువంటి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నట్టు స్పష్టమైంది. నిర్మాతలే కాకుండా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కూడా భారీగా నష్టాలను చవి చూస్తున్నారు.
గత మూడు, నాలుగు నెలల నుంచి మంచి టాక్ సంపాదించుకొన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద లాభాలను సాధించలేకపోయాయి. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ పేరిట నిర్మాతలు కొద్ది రోజులుగా సమావేశమవుతూ చర్చలు జరుపుతున్నారు. అయితే మంగళవారం అంటే జూలై 26వ తేదీన సమావేశమైన నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగులను నిరవధికంగా వాయిదా వేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.

నిర్మాతల గిల్డ్ విడుదల చేసిన ప్రకటనలో.. కరోనావైరస్ లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ పరిస్థితులు మారిపోయాయి. ఖర్చులు భారీగా పెరిగాయి. సినీ నిర్మాతల కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాతలందరూ చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. సానుకూలమైన పరిస్థితుల మధ్య, మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి సినిమాలను రిలీజ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూలమైన చర్చలు,ఫలితాలు వచ్చేంత వరకు సినిమా షూటింగులను ఆగస్టు 1వ తేదీ నుంచి నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకొన్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాతలు తీసుకొన్న తాజా నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











