‘వార్ 2, కూలీ డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపా? ఆ దరిద్రం తెలుగు ఇండస్ట్రీలోనే’
తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఎప్పడూ వివాదాస్పదమవుతూనే ఉంటుంది. తాజాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచడంపై నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. కూలీ, వార్ 2 లాంటి డబ్బింగ్ సినిమాలకు భారీగా టికెట్ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర భాషల్లో ఇలాంటి పరిస్థితి లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వ్యవహారం కొనసాగుతుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడంపై ఆయన మాట్లాడుతూ..
డబ్బింగ్ సినిమాలకు అవార్డులు ఇవ్వడం, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయి. కన్నడ సినిమా పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల రిలీజ్కు గతంలో నిషేధం ఉండేది. కానీ ఇటీవల కొంత సడలింపు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా టికెట్ రేట్లు పెంచే ప్రస్తకి కనిపించడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. డబ్బింగ్ సినిమాల టికెట్ రేట్లు పెంచడం విషయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఓ విధానం ప్రకటించాలి అనే అభిప్రాయాన్ని నట్టి కుమార్ పేర్కొన్నారు.

డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచే దరిద్రం మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు? కార్పోరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు సహకరించడం వల్లే ఈ పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు సబ్సిడీలు ఉంటే? మన రాష్ట్రాల్లో ఎందుకు ఉండవు. డబ్బింగ్ సినిమాలను ప్రోత్సహించకూడదు. చిన్న సినిమాల్ని కాపాడాలి అని ఆయన ప్రశ్నించారు.
డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్కు రాలేకపోతున్నారు. పేదవాడికి సినిమా చూసే హక్కు లేదా? నిర్మాతల స్వార్ధం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్లే థియేటర్లు మూత పడుతున్నాయి. సింగల్ స్క్రీన్ థియేటర్లను కాపాడాలి అని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉందంటూ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా ఇండస్ట్రీని నాశనం చేశారు. థియేటర్కు జనం రాకుండా చేశారు. సగటు ప్రేక్షకుడికి 500 టికెట్ పెట్టారు. ఒక డబ్బింగ్ సినిమాకు అంత రేటు పెట్టవచ్చా? పక్క రాష్ట్రంలో 183 రూపాయలు టికెట్ ఉంటే.. ఇక్కడ 390 రూపాయల టికెట్. ప్రేక్షకుడి ఆదాయం ఎంత? సినిమాకు అంత రేటు పెట్టి టికెట్ కొనే సామర్థ్యం ఉందా? నిర్మాతలు అన్ని కోట్లు పెట్టి కొనడం ఎందుకు? ప్రభుత్వం వద్దకు వెళ్లి టికెట్ రేటు పెంచడం ఎందుకు? ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
డబ్బింగ్ సినిమాల కొనుగోలు చేసి.. భారీగా టికెట్ రేట్లు పెంచడం కరెక్టేనా? నిర్మాతలు గుండెలపై చేయి వేసుకొని నిజం చెప్పాలి. ఎవరో తీసిన సినిమాను ఎక్కువ డబ్బు పెట్టి కొని. దానికి టికెట్ రేట్లు పెంచడం సమంజసమా? ప్రభుత్వాలు తమకు దగ్గర అని ఎంత పడితే అంత టికెట్ రేట్లు పెంచుతారా? అని నట్టి కుమార్ అన్నారు.


Click it and Unblock the Notifications











