నన్ను, నా సినిమాను తిట్టిన అందరూ మూసుకోవాల్సిందే: కంగనా రనౌత్
నన్ను, నా సినిమాను తిట్టిన అందరి నోళ్లూ త్వరలోనే మూతపడతాయి అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె నటించిన 'మణికర్ణిక' చిత్రం విడుదల దగ్గరపడుతున్న వేళ కంగనా ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
తన డిజైనర్ ఫ్రెండ్ నీతా లుల్లా ముంబైలో హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీకి సహ నటి అంకిత లోఖండేతో కలిసి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... 'మణికర్ణిక' విడుదల తర్వాత అందరి నోళ్లకు తాళం పడుతుందన్నారు.

అది తప్పకుండా జరుగుతుంది
నా గురించి, నా సినిమా గురించి చెడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ ‘మణికర్ణిక' చూసిన తర్వాత నోరు మూసుకుంటారు. మంచిగా మాట్లాడిన వారు మరింత ఉత్సాహ పడతారు. ఇది తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నాను అని కంగనా వ్యాఖ్యానించారు.

అందుకు కారణం ఎవరు?
‘మణికర్ణిక' చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న కంగనా రనౌత్..... సినిమా షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండగానే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో, ఆ బాధ్యతలు సైతం తన భుజాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం కంగనా వ్యవహార శైలి, ఆమె తీరు వల్లే షూటింగ్ పూర్తికాక ముందే క్రిష్ తప్పుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది.

రెండింటికి న్యాయం చేశానని భావిస్తున్నాను
అయితే ఇటీవల విడుదలైన ‘మణికర్ణిక' ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం చిత్ర బృందంలో మరింత ఉత్సాహం నింపింది. ఈ పరిణామాలపై కంగనా స్పందిస్తూ ‘టీమ్ వర్క్ వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నాను. మొదట అది కష్టం అనుకున్నా, కానీ కలిసి కట్టుగా పని చేశాం. నటిగా, దర్శకురాలిగా న్యాయం చేశాను అని భావిస్తున్నాను. దేవుడి దయ వల్లే అంతా సవ్యంగా సాగింది. రెండు బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ కోసం, ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.

తర్వాతి చిత్రానికి కూడా ఆయనే
బాహుబలి, బజరంగీ భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ‘మణికర్ణిక'కు కథ అందించారు. తాను దర్శకత్వ బాధ్యతలు చేపట్టే సమయంలో రైటర్ విజయేంద్రప్రసాద్ నుంచి అందిన సహకారం మరువలేను. నా తర్వాతి చిత్రానికి కూడా ఆయన కథ అందించబోతున్నారు అని కంగనా తెలిపారు.

ప్రేమ కథే, కానీ మనిషితో కాదు
మీ తర్వాతి సినిమా ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు కంగనా స్పందిస్తూ... ‘ఇది ఒక ప్రేమకథా చిత్రం... కానీ మనుషులతో కాదు' అన్నారు. గతంలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తను వెడ్స్ మను, తను వెడ్స్ మను: రిటర్న్' చేసిన కంగనా ఆయన తాజా చిత్రం ‘జీరో'పై స్పందిస్తూ తాను ఇంకా ఆ సినిమా చూడలేదని, మణికర్ణిక చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాను. త్వరలోనే చూస్తాను అన్నారు.

జనవరి 25న గ్రాండ్ రిలీజ్
నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 25న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఈ మూవీ విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











