Sushanth Singh Rajput సూసైడ్ కేసులో ట్విస్ట్.. దిశా సలియాన్ మరణంపై కీలక నిర్ణయం
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మేనేజర్ దిశా సలియాన్ మరణాలు సంచలనంగా మారాయి. అయితే వీరిద్దరి మరణాలు సహజ మరణాలు కావు.. అనుమానాస్పద మరణాలు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ మరణించి రెండేళ్లు దాటినా ఇప్పటికీ సుశాంత్, దిశా మరణాలపై అనేక ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. అయితే సుశాంత్, దిశా సలియాన్ మరణాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసు వివరాలు, అలాగే సుశాంత్ సింగ్ రాజ్పుత్, దిశా సలియాన్ మారణాల విషయంలోకి వెళితే..

దిశ సలియాన్ది హత్యే..
బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాంటి ప్రముఖులకు మేనేజర్గా వ్యవహరించిన దిశా సలియాన్ జూన్ 8వ తేదీ, 2020 రాత్రి ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని గెలాక్సీ రెంజెంట్ భవనంలోని 14వ అంతస్థు నుంచి పడి మరణించడం సంచలనంగా మారింది. అయితే ఆమెది ప్రమాదవశత్తూ సంబంధించిన మరణం కాదు. ఆమెది హత్యే అంటూ పలువురు ఆరోపించారు.

పార్టీలో గొడవ తర్వాత సుశాంత్కు ఫోన్
అయితే దిశా సలియాన్ తన మరణానికి ముందు ఓ బాలీవుడ్ ప్రముఖుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అక్కడ ఆమెపై జరిగిన లైంగిక వేధింపులు, గొడవ కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ కాల్ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమె భవనంపై నుంచి పడి మరణించిందనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి.

దిశా సలియాన్, సుశాంత్ మరణాలపై సీబీఐ
దిశా సలియాన్ మరణంపై అనుమానాలు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ విగత జీవిగా పడి ఉండటం బాలీవుడ్ను కుదిపేసింది. అయితే ఆ తర్వాత జరిగిన పోస్ట్ మార్టమ్, ఇతర సంఘటనలు సుశాంత్ది సహజ మరణం కాదు.. హత్యే అంటూ స్నేహితులు, సన్నిహితులు ఆరోపించారు. దాంతో విరిద్దరి మరణాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం తెలిసిందే.

ఏడాదిన్నరగా సీబీఐ దర్యాప్తు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో దిశా సలియాన్ మృతికి లింక్ ఉందనే ఆరోపణల ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో దిశా సలియాన్ కేసును ప్రత్యేకంగా రిజిస్టర్ చేయకుండా సీబీఐ దర్యాప్తు చేసింది. సుశాంత్ సూసైడ్ కేసు, దిశా సలియాన్ కేసును వేర్వేరుగా కాకుండా ఒక్కటిగానే విచారించింది. గత ఏడాదిన్నరగా ఈ రెండు కేసులపై దర్యాప్తు చేస్తున్నది.

దిశా సలియాన్ మద్యం సేవించి ప్రమాదవశాత్తూ
అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో భాగంగా దిశా సలియాన్ మరణం కేసులో సీబీఐ ఒక రిపోర్టును వెల్లడించింది. దిశా సలియాన్ మృతి ప్రమాదవశాత్తు జరిగింది. మద్యం మత్తులో పట్టు కోల్పోయి భవనంపై నుంచి పడిపోయింది. ఆమె మరణం వెనుక ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు అని సీబీఐ స్పష్టం చేయడం ఈ సంచలన కేసులో ట్విస్టుగా మారింది.


Click it and Unblock the Notifications











