చిక్కుల్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె.. ఆ కేసులో షాకిచ్చిన న్యాయస్థానం
భారతదేశంలో సినీతారలు సినిమాలు, వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు బ్రాండ్ ప్రమోటర్లుగా వ్యవహరిస్తూ అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నారు. కేవలం నిమిషం యాడ్లో నటిస్తే చాలు కోట్లలో ఆదాయం వచ్చి చేరుతోంది. ఒకరిని చూసి మరొకరు బ్రాండ్ అండార్స్మెంట్ వైపు వెళ్తున్నారు. ఎవరు ఎక్కువ వాణిజ్య ప్రకటనల్లో వారికి అంత క్రేజ్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే తమ జీవితకాలంలో ఒక్కటంటే ఒక్క యాడ్లోనూ నటించనివారు, ఏ ప్రొడక్ట్కి ప్రచారకర్తగా వ్యవహరించనివారు రజనీకాంత్ వంటి వారు కూడా ఉన్నారు.
బెట్టింగ్ యాప్స్పై ఈడీ సీరియస్
అయితే సెలబ్రెటీగా సామాజిక బాధ్యత కూడా తమ చేతుల్లో ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. నకిలీ ఉత్పత్తులు, నాసిరకం బ్రాండ్స్, మోసపూరిత విధానాలను తెలియకుండా కొందరు.. తెలిసి కొందరు ప్రమోట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ యాంకర్లు, సినీతారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు విచారణకు కూడా పిలిచారు. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసి దాదాపు 29 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టించింది.

మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
ఇక దేశాన్నే వణికించి, రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్, క్యూనెట్ వంటి సంస్థలకు ప్రమోషన్ చేసిన సెలబ్రెటీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు కూడా బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన బ్రాండ్ ప్రమోటర్గా వ్యవహరించిన సాయి సూర్య డెవలపర్స్ వేసిన వెంచర్లో భూమిని కొనుగోలు చేసి తాము మోసపోయామంటూ బాధితులు హైదరాబాద్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడం దుమారం రేపింది.
హ్యుందయ్ బ్రాండ్ ప్రమోటర్లుగా షారుఖ్, దీపిక
తాజాగా బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపిక పదుకొనెలు ఇదే తరహా కేసులో చిక్కుకున్నారు. వీరిద్దరూ హ్యుందయ్ కారు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన కీర్తి సింగ్ 2022 జూన్ నెలలో హ్యుందయ్ కంపెనీకి చెందిన అల్కాజార్ కారును దాదాపు 24 లక్షలకు కొనుగోలు చేశారు. కారు కొన్న కొద్దిరోజుల్లోనే ఇంజన్లో పలు ఇబ్బందులు వచ్చినట్లు గురించిన కీర్తి సింగ్.. కారు ఏజెన్సీని సంప్రదించగా, అది తయారీలోనే లోపమని దానిని సరిదిద్దలేమని చేతులెత్తేశారు. దీంతో తను ఈ కారు కొనడానికి కారణమైన హ్యుందయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేస్తున్న షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలు తనకు జరిగిన నష్టానికి బాధ్యత వహించాలంటూ కీర్తి సింగ్.. భరత్పూర్లోని సీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
షారుఖ్, దీపికలపై కేసు నమోదు
అలాగే షారుఖ్, దీపికలపై కేసు నమోదు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్ట్ ఈ ఇద్దరు నటులపై సెక్షన్ 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు సెలబ్రెటీలతో పాటు దానిని ప్రమోట్ చేసినవారు కూడా బాధ్యత వహించాలని గతంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. సీజేఎం కోర్ట్ ఆదేశాలకు మేరకు షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనెలతో పాటు ఆరుగురు హ్యుందయ్ కంపెనీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











