నన్ను బలి పశువును చేశారు.. నోరా ఫతేహి, ఇతర హీరోయిన్ల సంగతి ఏంటి? ఈడీపై జాక్వలైన్ సంచలన వ్యాఖ్యలు
దేశ సినిమా పరిశ్రమలో సంచలనం రేపిన 215 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోణం కేసులో నమోదు చేసిన చార్జిషీట్లో తన పేరును చేర్చడంపై బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ దర్యాప్తుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్లో తన పేరు చేర్చడంపై ఘాటుగా స్పందించారు. ఆమె సుదీర్ఘమైన వివరణ ఇస్తూ..

పారిశ్రామిక వేత్తల నుంచి బలవంతపు వసూళ్లు
తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై జైలుశిక్ష విధించారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ బయోకాన్ అధినేతలను బెదిరించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో తాను అమిత్ షా పీఏ అని ఫోనులో బెదిరించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు అనే విషయాలు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.

215 కోట్ల కుంభకోణంలో
అయితే సుకేష్ చంద్రశేఖర్ కేసులో విచారించిన ఈడీ అధికారులకు బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్కు ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. భారీగా బహుమతులు, నగదు సుకేష్ నుంచి జాక్వలైన్ ఫెర్నాండేజ్కు ముట్టాయనే విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో జాక్వలైన్ను ఈడీ అధికారులు పలు దఫాలు విచారించి చార్జిషీట్లో పేరును చేర్చారు. ఈ సంఘటనలపై జాక్వలైన్ స్పందించారు.

నేను బాధితురాలిని కాదని భావిస్తున్నా
సుకేష్ చంద్రశేఖర్పై కొనసాగుతున్న దర్యాప్తుకు తాను కేంద్ర దర్యాప్తు బృందానికి బేషరుతుగా సహకరించాను. ఈ కేసులో బాధితురాలిని కాదని భావిస్తున్నానని జాక్వలైన్ తెలిపింది. సుకేష్ రచించిన కుట్రలో తాను బలి పశువును అయ్యాను. నాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే అని జాక్వలైన్ అన్నారు.

ఉద్దేశపూర్వకంగానే నన్ను ఇరికించారు
సుకేష్ చేసిన కుట్రలో నేను బలి అయ్యాననే విషయాన్ని ఈడీ దర్యాప్తు సంస్థ గుర్తించలేదు. సుకేష్ మాఫియా వ్యవహారాల్లో చిక్కుకొన్నాను. నాకు తీరని అన్యాయం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు వాదనలకు మాత్రమే పరిమితమైంది. మనీలాండరింగ్ యాక్ట్ గానే.. ఇతర చట్టాల కింద కేసు నమోదు చేయలేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి జరిపిన విచారణగా భావిస్తున్నాను అని జాక్వలైన్ అన్నారు.

నోరా ఫతేహి, ఇతర హీరోయిన్ల మాటేంటి?
సుకేష్ చంద్రశేఖర్ మాఫియాలో నేను ఒక్కరినే ఆరోపణలు ఎదుర్కోలేదు. నోరా ఫతేహి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎందరో సినీ తారలకు సుకేష్ విలువైన గిఫ్టులు ఇచ్చాడు. వారిని సాక్షులుగా మాత్రమే పరిగణించారు. కానీ నాపై మాత్రమే నేరారోపణలు చేశారు. దీనిని బట్టి చూస్తే.. నాపై కేసు పెట్టడం వెనుక చాలా కుట్ర ఉంది. ఎవరి ప్రోద్బలం వల్లనే నా పేరును చార్జిషీట్లో చేర్చారనిపిస్తున్నది అని జాక్వలైన్ అన్నారు.


Click it and Unblock the Notifications











