30 వేల కోట్ల ఆస్తి కోసం కొట్లాట, మాజీ భర్త మృతితో సవతిపై కోర్టుకెక్కిన స్టార్ హీరోయిన్
ఆస్తుల కోసం సామాన్యులు తమ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఇతర రక్త సంబంధీకులతో కొట్లాటకు దిగినట్లే సెలబ్రెటీలు కూడా ఇదే చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, రాజవంశీయుడు సైఫ్ అలీఖాన్ ఆస్తి వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే సూపర్స్టార్ అమీర్ ఖాన్పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ పలు ఆరోపణలు చేయడంతో పాటు తనకు రావాల్సిన ఆస్తిపై కోర్టుకెక్కాడు. తాజాగా బాలీవుడ్ని శాసించే కుటుంబానికి చెందిన స్టార్ హీరోయిన్ తన మాజీ భర్త ఆస్తుల కోసం కోర్టుకెక్కడం కలకలం రేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
పోలో ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన సంజయ్
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇంగ్లాండ్లో పోలో ఆడుతుండగా సంజయ్ కపూర్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లాండ్లోని గార్డ్స్ పోలో క్లబ్లో పోలో మ్యాచ్ ఆడుతుండగా ఓ చిన్న పురుగు ఆయన నోటిలోకి వెళ్లింది. దానిని బయటకు తీయాలని సంజయ్ ఎంతో ప్రయత్నించారు. ఆ సమయంలో తీవ్రమైన అలర్జీ రియాక్షన్కు గురైన ఆయనకు ఊపిరి ఆడలేదు. దానితో పాటు తీవ్ర భయాందోళనకు గురికావడంతో గుండెపోటుకు దారితీసింది. ఆయన పరిస్ధితిని గమనించిన నిర్వాహకులు వెంటనే ఆటను నిలిపివేసి.. వైద్య సహాయం అందించినా ఫలితం దక్కలేదు. చివరికి సంజయ్ మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టైకూన్గా
ఇకపోతే .. భారతీయ ఆటోమొబైల్ రంగానికి సంజయ్ కపూర్ సుపరిచితులు. సోనా కామ్స్టార్ అనే సంస్తకు సంజయ్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీలో ఈ సంస్థ మన దేశంలో టాప్ ప్లేస్లో ఉంది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సంజయ్ కపూర్ వ్యవహరిస్తున్నారు. పోలో ఆటోను ఆయన ఎంతో ఇష్టపడేవారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పలు పోలో పోటీలలో పాల్గొనడంతో పాటు ఆరియస్ అనే పోలో జట్టు కూడా సంజయ్ కపూర్కు ఉంది.
సంజయ్ ఆస్తులు 30 వేల కోట్ల పైనే
తొలుత నందిత మహతానీని పెళ్లాడిన సంజయ్ కపూర్.. 2000వ సంవత్సరంలో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ కరిష్మా కపూర్ను సంజయ్ కపూర్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సమైరా, కియార్ కపూర్లు సంతానం. అయితే వ్యక్తిగత కారణాలతో సంజయ్ - కరిష్మాలు 2016లో విడాకులు తీసుకున్నారు. కరిష్మతో విడాకుల తర్వాత మోడల్, నటి ప్రియా సచ్దేవ్ను సంజయ్ మూడో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రాణాలతో లేకపోవడంతో సంజయ్ ఆస్తి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయల పైమాటే కావడం గమనార్హం. దీంతో సంజయ్ ఆస్తుల కోసం కరిష్మ కపూర్ పిల్లలకు, ఆయన మూడో భార్య ప్రియ సచ్దేవ్కు మధ్య గొడవ జరుగుతోంది.
మా వాటా మాకు ఇవ్వాల్సిందే
తమ తండ్రి వీలునామా విషయంలో ప్రియ సచ్దేవ్ తమను మోసం చేశారని.. ఆయన రాసిచ్చిన అసలు వీలునామాను దాచిపెట్టి నకిలీ వీలునామాను కుటుంబ సభ్యులకు చూపించారని కరిష్మ పిల్లలు సమైరా, కియాన్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తమ తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పడానికి కూడా ప్రియ ససేమిరా అన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తి నుంచి చట్టప్రకారం తమకు రావాల్సిన వాటాను ఇప్పించాలని కరిష్మ పిల్లలు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈ వ్యవహారం సినీ, కార్పోరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











