Lata mangeshkar no more: భారతీయ ధృవతార అస్తమయం.. సంగీత ప్రపంచానికే తీరనిలోటు.. చిరంజీవి, పవన్, బాలయ్య ట్వీట్స్
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అద్భుతమైన గాయని లతా మంగేష్కర్ ఇక లేరు. ఏడు దశాబ్దాలకుపైగా సంగీత సాగరంలో తన గాన మాధుర్యంతో అభిమానులను ఉర్రూతలూగించిన ధృవతార అస్తమించింది. ఆమె మరణాన్ని అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. సినిమా పరిశ్రమ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మోహన్లాల్ , కార్తీ తదితరులు సంతాపం తెలియజేశారు. ఇంకా ఎవరెవరు తమ ఆవేదనను వ్యక్తం చేశారనే విషయాల్లోకి వెళితే..
భారత దేశపు ముద్దుబిడ్డ అంటూ బాలకృష్ణ
భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7 దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనం. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు..
భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే...అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయి. లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.
లతా దీదీ ఇక లేరు అంటూ చిరంజీవి
నైటింగేల్ ఇండియా, సినిమా పరిశ్రమలో దిగ్జజ ప్రముఖుల్లో ఒకరు. లతా దీది ఇక లేరు ఆమె మరణవార్తతో గుండె ముక్కలైనంత పనైంది. ఆమె మరణంతో ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆమె ఉన్నతమైన జీవితాన్ని గడిపడమే కాకుండా గొప్ప స్పూర్తిని అందించారు. ఆమె పాటలు నిరంతరం ప్రజల జీవితాల్లో భాగమవుతాయి. మ్యూజిక్ ఉన్నంత కాలం లతా పాటలు ఉంటాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్లో సంతాపం తెలిపారు.

ప్రతీ గీతం మంత్రముగ్దుల్ని చేసిందంటూ పవన్
భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార గానకోకిల లతా మంగేష్కర్ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు. అనారోగ్యం నుంచి కోలుకోని ఇంటికి వెళ్తారని వార్తలతో స్వస్థత చేకూరింది. కానీ ఇలా విషాదవార్త వినాల్సి వచ్చింది. లతాజీ పాటకు భాషభేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతీ గీతం సంగీతాభిమానులను మంత్రముగ్దులను చేసింది. వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుంది. తెలుగులో కేవలం రెండే రెండు పాటలు పాడినా అవి మరిచిపోలేనివి. నిదురపోరా తమ్ముడా.. తెల్ల చీరకు పాటలు శ్రోతలను మెప్పించాయంటే లతా గానమే కారణం. ఏడు దశాబ్దాలపైబడి సాగిన ఆమె గానయజ్గం.. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను నిలిచి గెలిచిన తీరు స్పూర్తి దాయకం. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని.. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
మోహన్ లాల్ తీవ్ర ఆవేదనతో
భారతరత్న, సంగీత దిగ్గజం లతా మంగేష్కర్ మరణవార్త అత్యంత విషాదం కలిగించింది. ఆమె సంగీతం, పాటల ద్వారా చిరకాలం ప్రజల హృదయాల్లో జీవిస్తారు. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి అని నటుడు మోహన్ లాల్ ట్వీట్ చేసి సంతాపం తెలిపారు.
నటుడు కార్తీ సంతాపం తెలియజేస్తూ..
లతా మంగేష్కర్కు నటుడు కార్తీ సంతాపం తెలియజేస్తూ.. లతాజీ గానం, గాత్ర స్పూర్తిదాయకమైనది. లక్షలాది మంది ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా స్పూర్తిని అందించారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆమె పాటలు, సంగీతం ఉండిపోతాయి అంటూ కార్తీ ట్వీట్ చేశారు. ఆమెకు ఘనంగా నివాళి అర్పించారు.
దర్శకుడు అనిల్ రావిపూడి సంతాపం
లతా మరణంపై తీవ్ర దిగ్బ్రాంతిని దర్శకుడు అనిల్ రావిపూడి వ్యక్తం చేస్తూ .. దిగ్గజ గాయని మరణంతో విషాదంలో మునిగిపోయాను. లెజెండరీ గాయనిని, భారత నైటింగేల్ కోల్పోవడం దురదృష్టకరం. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి కలుగాలి. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
భారతీయ నైటింగల్ శకం ముగిసింది
ఈ రోజు చాలా దుర్దినం. భారతీయ నైటింగల్ శకం ముగిసింది. లతా మంగేష్కర్ ఇకలేరు. ఆమె పాటలతో మన హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటారు. ఆమె పాటలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. లతాజీ స్నేహితులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











