పుట్టుకతోనే అంధత్వం.. తెలుగు పారిశ్రామికవేత్తపై బాలీవుడ్ బయోపిక్.. శ్రీకాంత్ బొళ్ల ఎవరంటే?
అంధత్వం మనిషికే గానీ.. మనసుకు, ఆలోచనలకు లేదని నిరూపించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్త. అందుకే ఆయన జీవితాన్ని పలువురిలో స్ఫూర్తిని రగిలించేందుకు బాలీవుడ్ నిర్మాత ముందుకొచ్చారు. పుట్టు అంధుడైన యువ పారిశ్రామికవేత్తపై సినిమాను రూపొందించనున్నట్టు నిర్మాత తుషార్ హీర నందానీ ప్రకటించారు. ఇంతకు ఈ యువ అంధ పారిశ్రామిక వేత్త ఎవరు? అతడి జీవితం ఎందుకంత స్ఫూర్తిదాయకం అనే విషయాల్లోకి వెళితే..

శ్రీకాంత్ బొళ్ల జీవితం ఆధారంగా బయోపిక్
ఇటీవల తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్ లాంటి అగ్రహీరోయిన్లతో సాండ్ కీ ఆంఖ్ అనే బయోపిక్ చిత్రాన్ని తుషార్ హీరా నందానీ తెరకెక్కించారు. ఈ సినిమా మేధావులు, సినీ విమర్శకులు ప్రశంసలు అందుకొన్నది. ఆ సినిమా అందించిన ఉత్సాహంతో ప్రస్తుతం మచిలీపట్నంకు చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొళ్ల జీవితాన్ని బాలీవుడ్ చిత్రంగా మలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ బొళ్ల
ఇక శ్రీకాంత్ బొళ్ల జీవితం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని మంచిలిపట్నంకు సమీపంలోని సీతాపురం గ్రామానికి చెందిన వారు. 1992లో ఆయన జన్మించారు. ఆయన వయసు 28 సంవత్సరాలు. పుట్టుకతోనే ఆయన అంధుడు. అయితే తనకు చూపులేదని ఏ క్షణంలో కూడా నిరుత్సాహం చెందలేదు. చదువుకోవాలని చేసిన ప్రయత్నాలకు విద్యాధికారులు అడ్డుపడ్డారు. అంధులకు చదువు చెప్పడానికి అనుమతులు లేవని నిరాకరించారు.

స్కూల్ విద్యకు ఆటంకాలు
తన విద్యకు అనుమతి లేదని అధికారులు అడ్డుపడటంతో శ్రీకాంత్ బొళ్లతోపాటు ఆయన కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో పిటిషన్ వేసి విజయాన్ని అందుకొన్నారు. దాంతో కొన్ని అభ్యంతరాలు చెబుతూ శ్రీకాంత్ను స్కూల్లో చేర్చుకోగా, పట్టుదలతో ఎవ్వరికీ తీసిపోని విధంగా క్లాస్లో అత్యుత్తమ ప్రతిభను చాటారు. 12 బోర్డు పరీక్షల్లో 98 శాతం మార్కులు సాధించిన విద్యార్థిగా ఘనతను సొంతం చేసుకొన్నారు.

అమెరికా యూనివర్సిటీలో చదువు
12వ తరగతిలో ఉత్తమ ప్రతిభను చాటిన శ్రీకాంత్ బొళ్ల అమెరికాలో చదివేందుకు ప్లాన్ చేసుకొన్నారు. మస్సాచుస్సెట్స్ ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీ)లో సీటు సంపాదించారు. అంతేకాకుండా ఎంఐటీలో సీటు సంపాదించిన తొలి అంధ అంతర్జాతీయ విద్యార్థిగా ఘనతను సాధించారు. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ఎన్నో కార్పోరేట్ కంపెనీలు మంచి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తే తిరిగి ఇండియాకు వచ్చారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చి
అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీని రతన్ టాటా అందించిన ఆర్థిక సహాయంతో స్థాపించారు. పోక వక్క ఆకులతో ప్లేట్స్, పేపర్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీని స్థాపించి.. ఆ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ వసతి కల్పించారు. ఫోర్బ్స్ ఆసియా జాబితాలో చోటు సంపాదించిన ముగ్గురిలో ఒక్కరిగా నిలిచారు. కేవలం లాభాపేక్షనే కాకుండా స్వచ్ఛంద సేవలో భాగమయ్యారు. పలు ఆశ్రమాలకు నిధులు అందజేసి ఆదుకొంటున్నారు.

శ్రీకాంత్ బొళ్ల బయోపిక్ గురించి తుషార్ హీరా నందానీ వెల్లడిస్తూ..
వాస్తవానికి సాండ్ ఖీ ఆంఖ్ చిత్రానికి ముందే ఈ బయోపిక్ను తెరకెక్కించాలని అనుకొన్నాను. ఈ చిత్రాన్ని కొంత అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంటుంది. బడ్జెట్ పరిమితుల కారణంగా మేము ఓ అడుగు వెనకకు వేశాం. ప్రస్తుతం ఈ సినిమా కథపై సాండ్ ఖీ ఆంఖ్ రచయిత జగదీప్ సిద్దూతో కలిసి పనిచేస్తున్నాం అని తెలిపారు.
Recommended Video

స్నేహితురాలు కీలక పాత్ర
శ్రీకాంత్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి స్వర్ణలత అనే ఫ్రెండ్. ఆయనలోని పట్టుదల, ప్రతిభను చూసి ఎల్లప్పుడూ ఆమె ప్రోత్సహించారు. ప్రస్తుతం స్వర్ణలత బొల్లాంట్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్లో సభ్యురాలు. ఈ సినిమా చాలా రియాలిటీతో ఉంటుంది. శ్రీకాంత్కు పక్కా హైదరాబాదీ యాసపై మంచి పట్టు ఉంది. ఆయన సొంత గ్రామంతోపాటు హైదరాబాద్లో షూట్ చేస్తాం. శ్రీకాంత్ జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయనలో అంధత్వం ఎక్కడా కనిపించదు. ఆయన విజన్ చాలా గొప్పగా ఉంటుంది. ఎందరికో కనువిప్పు కలిగించేలా ఉంటుంది అని నిర్మాత హీరా నందానీ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











