ఇప్పట్లో టికెట్ రేట్ల పెంపు లేనట్టే.. జీవో మరింత లేట్.. భీమ్లా నాయక్ పరిస్థితి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ ప్రముఖులు భేటీ అయి తమ సినీ పరిశ్రమకు ఉన్న కష్టాలు చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన సినిమా టికెట్ రేట్లు కూడా పెంచాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్ని సందిగ్ధతలు తొలగిపోయాయని ఇక మీదట ఆ సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని చిరంజీవి కూడా పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు టికెట్ రేట్లు పెంచిన జీవో అమలులోకి వస్తుందని భావిస్తున్న క్రమంలో ఈ నెలాఖరులోపు ఆ జీవో జారీ చేసే ఆలోచన ప్రభుత్వానికి అయితే లేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

వకీల్ సాబ్ సమయుంలో రేట్ల పెంపు
సినిమా విడుదల సమయంలో భారీగా టికెట్ రేట్లు పెంచేసి ఇష్టారీతిన టిక్కెట్లు అమ్ముకున్నారని అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నిర్ణయించిన ధరకే జరగాలని చెబుతూ ఆంధ్ర ప్రభుత్వం గత ఏడాది జీవో నెంబర్ 35 జారీ చేసింది. అయితే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో చేయడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ను సినిమా పరంగా నిలువరించేందుకు ఈ జీవో తీసుకువచ్చారని రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. అయితే తమ రాష్ట్ర ప్రజలు వినోదాన్ని కూడా తక్కువ రేట్లకే పొందాలనే ఉద్దేశంతో ఈ జీవో జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్ధించుకుంది.

సినీ ప్రముఖుల విజ్ఞప్తితో
టికెట్ రేట్లు తగ్గించడం వలన మేము ఎలా నష్టపోతున్నాము అనే విషయాన్ని చిరంజీవి సహా కొంతమంది సినీ ప్రముఖులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇటీవల చిరంజీవి సహా కొంతమంది హీరోలు దర్శకులు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ భేటీలో వైఎస్ జగన్ నుంచి అభయం రావడంతో ఈ నెలాఖరులోపు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన అన్ని విషయాల మీద క్లారిటీ వస్తుందని ఇక ఇబ్బంది ఉండదని చిరంజీవి సహా భేటీకి హాజరైన మహేష్ బాబు, ప్రభాస్ రాజమౌళి కొరటాల శివ లాంటి వారు వెల్లడించారు.

ఇప్పుడు రేట్లు పెంచడం కష్టమే
అదలావుంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు రేట్లు సవరించిన జీవో జారీ చేసే ఆలోచన లేదని తెలుస్తోంది. మార్చి నెలలో కొత్త జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ భీమ్లా నాయక్ సినిమాను మాత్రం ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. గతంలో కూడా నాగవంశీ టికెట్ రేట్లు అంశం తనకు ముఖ్యం కాదని ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ఎత్తివేసి 100 శాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు ప్రకటిస్తారో అప్పడు సినిమా విడుదల చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వెల్లడించారు. ఇప్పుడు అదే బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారని అంటున్నారు. ఇప్పుడు పవన్ స్టామినా ప్రకారం కలెక్షన్ రావాలి తప్ప వేరే దారి లేదని అంటున్నారు. రేట్లు పెంపు కానీ అధిక షోలు కానీ వేసుకునే అవకాశమే లేదని అంటున్నారు.

కొత్త కమిటీ భేటీ
నిజానికి అమరావతిలో గురువారం నాడు సినిమా టికెట్ల పెంపు కోసం ప్రభుత్వం వేసిన కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రికమెండేషన్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే టికెట్ రేట్ల పెంపు మీద తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. భౌగోళిక క్యాటగిరీలో జీవో 35 ప్రకారం నాలుగు ప్రాంతాలను మూడు ప్రాంతాలుగా మార్చి కమిటీ సిఫార్సు చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ గా ఉండగా ఇప్పుడు గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ కలిపి నగర పంచాయతీ ఏరియాగా సిఫార్సు చేసినట్లు సమాచారం.

త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం
అంటే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలుగా మాత్రమే ఇక మీదట పరిగణించనున్నారు. అంతే కాక టికెట్ల క్లాసుల్లో కూడా సవరణకు కమిటీ సూచనలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు మొత్తం మూడు క్లాసులు ఉన్నాయి అవి డీలక్స్, ప్రీమియం, ఎకానమీ కాగా ఇప్పుడున్న మూడు క్లాసులకు బదులు ఇక రెండే ఉంచేలా సూచనలు చేశారని అంటున్నారు. ఇక డీలక్స్ క్యాటగిరికి గుడ్ బై చెప్పనున్నారని అన్ని థియేటర్లలో ఎకానమీ, ప్రీమియం రెండే క్లాసులకు సిఫార్సు చేయనున్నారని చెబుతున్నారు. అంటే 40 శాతం సీట్లు ఎకానమీ క్యాటగిరి ఉంచి మిగిలినవి ప్రీమియంగా పరిగణించనున్నారు


Click it and Unblock the Notifications











