సెన్సారే కాలేదు...మరి ఈ సెన్సార్ టాక్ ఏంటి
హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో దేవా కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య' . మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈచిత్రం విడుదలకు సిద్ధమైన నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ నిన్న జరిగిందని U/A సర్టిఫికేట్ ఇచ్చారని మీడియాలో ముఖ్యంగా వెబ్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే అందిన సమచారం ప్రకారం ఆ సినిమా సెన్సార్ జరగలేదని తెలుస్తోంది. ఈ రోజు సెన్సార్ చేయనున్నారని చెప్తున్నారు. అయితే చిత్రంగా సెన్సార్ టాక్ సైతం బయిటకు వచ్చేసింది. సెన్సార్ కాకుండానే సెన్సార్ టాక్ ఏంటని సినీ వర్గాలు కామెంట్స్ చేసుకుంటున్నారు.
మరో ప్రక్క జులై 10వ తేదీ వరకు చిత్ర విడుదలను నిలిపివేయాలని గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాణానికి తన వద్ద రూ.2కోట్లు రుణం తీసుకున్నారని, అది తీర్చకపోగా పంపిణీ హక్కులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. గుంటూరుకు చెందిన ఎంరాల్ ప్రాజెక్టు యజమాని మహ్మద్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు చిత్ర విడుదలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది.
ఈ సందర్భంగా దేవా కట్టా చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆత్మాభిమానానికి, ఆత్మవంచనకు...మనిషి విలువకు, పశుబలానికి నడుమ జరిగే పోరాటంలో మంచే జయిస్తుందని బలంగా విశ్వసించే యువకుడి కథే ఆటోనగర్ సూర్య.నాగచైతన్య గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో కనిపిస్తాడు. అతడి కెరీర్లో ప్రత్యేక చిత్రమవుతుంది అన్నారు.

అచ్చిరెడ్డి చిత్రం గురించి మాట్లాడుతూ ' ఈ చిత్రంలో నాగచైతన్య క్లాస్ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంటాడు. నాగచైతన్య, సమంత కాంబినేషన్లో మరో హిట్ మూవీ అవుతుంది. అలాగే 'ప్రేమ కావాలి', 'పూలరంగడు' చిత్రాల తరువాత మా బేనర్కి 'ఆటోనగర్ సూర్య' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.
విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











