చిరంజీవి ఇక ఇటు వైపే, నెక్ట్స్ 151 కూడా....!
హైదరాబాద్: మెగాస్టార్గా తెలుగు సినీ పరిశ్రమను ఏలిన చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పత్తాలేకుండా పోయింది. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన ఆయనకు కేంద్రమంత్రి పదవి లభించడం కాస్త ఊరట కలిగించే అంశం. గడిచిన ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ ఓటమి పాలవ్వగా... తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ మనుగడే కష్టం అనే పరిస్థితి తయారైంది.
అదృష్టం ఏమిటంటే...ఇంత జరిగినా మెగా అభిమానులు, సినీ అభిమానులు చిరంజీవిని ఇంకా నటుడిగా ఆరాధిస్తూనే ఉన్నారు. ఆయన 150వ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నా....కళాకారుడిగా చిరంజీవికి బ్రహ్మరథం పడుతున్నారు.

పరిస్థితి చూస్తుంటే చిరంజీవి ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడన్న మాటేగానీ... పార్టీ కార్యకలాపాలకు, అసలు రాజకీయాలకే వీలైనంత దూరంగా ఉంటున్నారు. ఆగస్టులో తన పుట్టినరోజు సందర్భంగా 150వ సినిమా మొదలు పెట్టబోతున్న చిరంజీవి ఇకపై వరుస సినిమాలతో బిజీగా కావాలని నిర్ణయించుకున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 150వ సినిమా పూర్తయిన తర్వాత.... వివి వినాయక్ దర్శకత్వంలో 151వ సినిమా కూడా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల వివి వినాయక్ చిరంజీవిని కలిసి సుధీర్ఘంగా చర్చించారు. వినాయక్ చిరంజీవిని కలవడంతో పూరి 150వ సినిమా నుండి తప్పుకున్నాడని, వినాయకే 150వ సినిమా హ్యాండిల్ చేస్తారనే ప్రచారం మొదలైంది. అయితే వినాయక్ కలిసింది 150వ సినిమా విషయమై కాదని, 151వ సినిమా గురించే అని తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం.


Click it and Unblock the Notifications











