వీరసింహరెడ్డి, వాల్తేరు వీరయ్య వేదికల మార్పు! ఏపీ ప్రభుత్వంపై బాలకృష్ణ, చిరంజీవి అసహనం? ఫ్యాన్స్లో ఆందోళన
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణపై ఒంగోలు, వైజాగ్ పోలీసులు, అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 6వ తేదీన ఒంగోలులో వీరసింహారెడ్డి, జనవరి 8వ తేదీన వైజాగ్లో వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించేందుకు మైత్రీ మూవీస్ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లపై వేదిక మార్పుకు సంబంధించిన వ్యవహారంపై చిత్ర యూనిట్ అసహనంతో ఉన్నట్టు సమాచారం. ఈ వివాదం గురించిన వివరాల్లోకి వెళితే..

ఒంగోలులో వీరసింహారెడ్డి, వైజాగ్ వీరయ్య
ఒంగోలు ఏబీయం స్టేడియంలో వీరసింహారెడ్డి, వైజాగ్లో వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ తరఫున శ్రేయాస్ మీడియా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రాంగణం ప్రాంతాలను పూర్తిగా ముస్తాబు చేశారు. ఈ క్రమంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను మార్చుకోమని అధికారులు ఆంక్షలు, అనుమతుల్లేవని నోటీసులు ఇవ్వడంతో వివాదంగా మారింది.

అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు
అయితే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ అంతా సర్వసిద్దమైన నేపథ్యంలో ఒంగోలులో మైత్రీ మూవీ మేకర్స్, శ్రేయాస్ మీడియా కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈవెంట్ నిర్వహించుకొనేందుకు పక్కాగా అనుమతులు ఉన్నాయి అని మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ప్రభుత్వ నేతలు ఈ సమాచారం అందుకొన్న తర్వాత వేదిక మార్పుపై అదేశాలు చకచకా జరిగిపోయినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

అధికారుల అభ్యంతరంతో వేదిక మార్పు
అయితే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో అనువైన ప్రదేశం కోసం నిర్వాహకులు వేట మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను మహానాడు నిర్వహించిన ప్రదేశంలో గానీ, లేదా ఒంగోలు బయట అనువుగా ఉండే ప్రదేశాన్ని వెతుకుతున్నట్టు సమాచారం.

ఖరారు కానీ వేదికలు..అభిమానుల్లో అందోళన
ఇదిలా ఉండగా, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వేదిక మార్పుల అంశంపై ఇంకా సందిగ్దత కొనసాగుతున్నది. వేదిక ఎక్కడ అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ల వేదికల ఆకస్మిక మార్పుపై మైత్రీ మూవీస్ నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు. గురువారం ఉదయానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇంకా వేదికలు ఖరారు కాకపోవడంతో అభిమానుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి, బాలయ్య అసహనం?
అయితే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్కు ట్రాఫిక్ సమస్యల పేరుతో అడ్డంకులు కల్పించడం, వేదిక మార్పు వ్యవహారంపై స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. వేదిక మార్పు వ్యవహారంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్కు సూచించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బాలకృష్ణ, చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లలో స్పందించే అవకాశముందనే మాట మీడియాలో వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











