నిర్మాతను సేవ్ చేయటానికే పవన్ ఆ నిర్ణయం...
హైదరాబాద్ :పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' విడుదలవక ముందే ఇంటర్నెట్లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందంతోపాటు యావత్తు తెలుగు సినిమా రంగం ఉలిక్కిపడింది. వెబ్సైట్తోపాటు చిత్రానికి సంబంధించిన పైరసీ సిడిలు మార్కెట్లోకి విడుదలై హల్చల్ చేస్తుండడంతో చిత్ర బృందం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాయి. ఈ నేఫధ్యంలో నిర్మాత ఈ లీకేజ్ ద్వారా నష్టపోకూడదని, తాను తీసుకున్న 12 కోట్ల రెమ్యునేషన్ ని తిరిగి నిర్మాతకు ఇచ్చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తన ప్రాజెక్టు వల్ల ఏ నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే పవన్ ఇలా చేసినట్లు చెప్తున్నారు.
ఇక కంప్లైంట్ తో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సినిమా లింక్ను మొదటగా వెబ్ సైట్లో ఉంచిన మీడియా ఫైర్ వెబ్ సైట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అలాగే వివిధ సైట్లలో ఉన్న లింక్లను బ్లాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దీనిపై డిజిపి దినేష్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పైరసీకి పాల్పడిన వ్యక్తులెవరైనా వారిని కఠినంగా శిక్షించాలని డిజిపిని కోరినట్లు ఆయన మీడియాకు చెప్పారు. అలాగే ఇంటర్నెట్లో ఈ చిత్రానికి సంబంధించిన లింక్లను గమనిస్తే తమకు తెలియచేయాల్సిందిగా ఆయన కోరారు. పవన్ అభిమానులు చిత్ర పైరసీ సిడిలను విక్రయిస్తున్న వారి గురించి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
'అత్తారింటికి దారేది' సినిమాలోని తొలి 90నిమిషాల్ని ఇంటర్నెట్లో ఎవరో పెట్టేయటంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కు గురయింది. పైరసీ విజువల్స్ ఎవరూ వాడినా చర్యలు తీసుకుంటామని నిర్మాతలు హెచ్చరించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్నెట్ లింకుల్ని తెలుసుకొని వాటిని బ్లాక్ చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే రెండు వారాల ముందుగా ఈ నెల 27నే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా పైరసీకి గురైన నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది ఇలా వుండగా పవన్కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో నటించిన సమంత ఈ చిత్రం పైరసీపై ట్విట్టర్ ద్వారా అభిమానులకు పలు విన్నపాలు చేసింది. 'సినిమాను ఎంతో కష్టపడి చేసాం. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఒక మంచి సినిమా ఇలా విడుదలకు ముందే పైరసీ కావడం బాధ కలిగించింది. సినిమాకు మద్దతుగా నిలవండి. పైరసీని అరికట్టండి. సినిమాను విజయవంతం చేయండి''అంటూ సమంత ట్విట్టర్ ద్వారా కోరింది.
బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించారు. సుమంతతోపాటుగా ప్రణీత కూడా ఇందులో పవన్ కళ్యాణ్తో జతకట్టింది. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, సహ నిర్మాతలు: బోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్, రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












