మెగా హీరోలతో ప్రశాంత్ నీల్ మల్టీస్టారర్.. ఆ నిర్మాత RRR రేంజ్ ప్లాన్!
పేరుకు కన్నడ పరిశ్రమకు చెందిన దర్శకుడే అయినప్పటికీ.. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు టాలెంటెడ్ క్రియేటర్ ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్తో ఇండియన్ సినిమాలో భారీ సక్సెస్ను అందుకున్న అతడు.. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీపై ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు చిత్రాలను లైన్లో పెట్టేశాడు. ఇక, ఇప్పుడు మూడో ప్రాజెక్టును కూడా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. బడా ప్రొడ్యూసర్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఈ సినిమాలో ఏకంగా ఇద్దరు మెగా హీరోలు నటిస్తున్నారట. ఆ సంగతులు మీకోసం!

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రెడీ
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీనికి సీక్వెల్గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించాడు. ఇప్పటికే ఈ మూవీ పనులన్నీ పూర్తి అయ్యాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కరోనా ప్రభావం పెరిగింది. ఆ మధ్య విడుదలైన టీజర్ ఇండియన్ రికార్డులను బద్దలు కొట్టేసి అంచనాలు రెట్టింపు చేసేసింది.

టాలీవుడ్లోకి ఎంటర్... ప్రభాస్తో
'కేజీఎఫ్' తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా అతడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్తో 'సలార్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తైంది. హొంబళే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఎన్టీఆర్తో సినిమా ప్రకటించాడుగా
వరుస విజయాలతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. నందమూరి హీరో పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో వస్తుందని కొందరు.. వార్ నేపథ్యంతో వస్తుందని కొందరు అంటున్నారు.

మూడో ప్రాజెక్టుపై సస్పెన్స్ ఉంచి
టాలీవుడ్లో వరుస సినిమాలను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్తో 'సలార్', జూనియర్ ఎన్టీఆర్తో ఓ సినిమాను ప్రకటించిన అతడు.. మరో దానిని కూడా లైన్లో పెట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సినిమాను చేస్తున్నట్లు చెప్పకనే చెప్పేసిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ నీల్ మూడో సినిమా అదే
ప్రశాంత్ నీల్ మూడో సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, అందులో హీరో ఎవరు? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో రెండు రోజులుగా టాలీవుడ్లో దీని గురించే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మాత్రం మెగా హీరోతోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇది మల్టీస్టారర్ మూవీ అట.

మెగా హీరోలతో ప్రశాంత్ మల్టీస్టారర్
తెలుగులో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే మూడో సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారట. ఇప్పటికే వీళ్లిద్దరికీ స్టోరీ లైన్ కూడా వినిపించాడట సదరు దర్శకుడు. ఇది బాగా నచ్చడంతో వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. ఈ చిత్రం 2022 చివర్లో గానీ 2023 ఆరంభంలో కానీ ప్రారంభం అవుతుందని టాక్.
Recommended Video

ఆ నిర్మాత RRR రేంజ్ ప్లాన్ రెడీ
మెగా మల్టీస్టారర్గా రాబోయే ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న RRR మూవీ రేంజ్లోనే దీన్ని కూడా తీయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











