సంఘమిత్ర నుంచి శృతి తప్పుకోవడానికి కారణాలు ఇవేనా?.. అనుష్కకు లైన్ క్లియర్
తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సుందర్ సీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లీడ్ క్యారెక్టర్ శృతిహాసన్ తప్పుకోవడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఏకంగా సినిమాకు వెన్నముక లాంటి సంఘమిత్ర పాత్రధారి శృతిహాసన్ తప్పుకోవడం ద్వారా ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది. ఈ సినిమా కోసం శృతిహాసన్ అన్ని రకాలుగా సంసిద్ధమైంది. ఈ చిత్రం కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి విద్యలను నేర్చుకొన్నది. ఇలా అనేక రకాలుగా చొరవ తీసుకొన్న శృతి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది.
అట్టహాసంగా కేన్స్లో ఫస్ట్లుక్
ఇటీవల జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2017లో సంఘమిత్ర చిత్రం ప్రమోషన్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఆ వేదికపై శృతిహాసన్ మిలమిలా మెరిసింది. అన్ని తానై ప్రాజెక్ట్ను ముందుకు నడిపించింది. హాలీవుడ్ ప్రముఖులను కూడా కలిసింది. ఇలా జోరుగా ప్రాజెక్ట్ ముందుగా సాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా చిత్రం నుంచి వైదొలగడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే శృతిహాసన్ తప్పుకుందా లేక తప్పించారా అనే అంశంపై చర్చ జరుగుతున్నది.

శృతిహాసన్ పెళ్లి ఆలోచనలు.. అఫైర్
శృతిహాసన్ ప్రస్తుతం లండన్ నటుడు మైఖేల్ కోర్సెలాతో అఫైర్ కొనసాగిస్తున్నది. మైఖేల్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాక ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో శృతిహాసన్ మానసికంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలనేది నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం కెరీర్, పెళ్లి, అఫైర్ అంశాల మధ్య శృతిహాసన్ ఊగిసలాటలో ఉన్నదనే ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. అందుకే నిర్మాతలకు, శృతిహాసన్కు మధ్య విభేదాలు తలెత్తాయనేది ఆ వార్త సారాంశం.

సంఘమిత్రగా అనుష్క
ఇదిలా ఉండగా, బాహుబలి తర్వాత అనుష్క పెర్ఫార్మెన్స్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. సంఘమిత్ర పాత్రలో అనుష్క స్థాయి నటన ప్రదర్శిస్తుందా అనే సందేహం నిర్మాతల్లో తలెత్తిందని, అందుకే శృతిహాసన్పై మరోసారి వారు ఆలోచనలలో పడ్డారనేది సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. అందుకే శృతిహాసన్ ఎలాగైనా బయటకు పంపిచాలనే కోణంలో నిర్మాతలు కసరత్తు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

అనుష్కకు లైన్ క్లియర్..
శృతిహాసన్ తప్పుకోవడం ద్వారా సంఘమిత్ర చిత్రంలోకి అనుష్క ఎంట్రీ క్లియర్ అయినట్టు కోలీవుడ్ కోడై కూస్తున్నది. సంఘమిత్రలో అనుష్క చేరితే ప్రాజెక్ట్కు మరింత క్రేజ్ వస్తుందనే మాట వినిపిస్తున్నది. అయితే బాహుబలి తర్వాత పిరియాడిక్ ఫిలిం ప్రమాణాలు బాగా పెరిగాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ఇతర పాత్రధారుల్లో అనూహ్య మార్పులు జరిగే అవకాశం కూడా ఉందనే మాట వినిపిస్తున్నది.

2018లోనే విడుదల
ఇదిలా ఉండగా, 2018లో సంఘమిత్ర చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నామని దర్శకుడు సుందర్ సీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ ఇంకా రెడీగా లేదని, ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమనే వార్తలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం రూ.250 కోట్లతో తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి బాహుబలికి పనిచేసిన ప్రముఖ కళాదర్శకుడు సాబు సిరిల్ ప్రొడక్షన్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











