అతనికి మరో అవకాశం ఇస్తున్న మహేష్ బాబు?
హైదరబాద్: మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ ప్రచారం మొదలైంది. మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందట.
ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబుకు స్టోరీ చెప్పారని, స్క్రిప్టు నచ్చడంతో మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది. వీరి కాంబినేషన్లో సినిమా విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ సమాచారం అందలేదు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ గుజరాత్లో ప్లాన్ చేసారు. ఈ మేరకు మహేష్ బాబుతో పాటు సినిమా యూనిట్ సభ్యులు గుజరాత్ వెళ్లబోతున్నారు.
సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగ్ గుజరాత్లో జరుపనున్నారు. కొన్ని వారాల పాటు యూనిట్ సభ్యులంతా ఇక్కడే గడపబోతున్నారు. యాక్షన్, కామెడీ, ప్యామిలీ డ్రామా కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేస్ బాబు సరసన తమన్నా హీరోయిన్. సోనూ సూద్ మెయిన్ విలన్గా నటిస్తున్నాడు.
ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయి కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫ్ కెవి గుహన్ ఈచిత్రానికి పని చేస్తున్నారు. దసరా నాటికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











