స్టార్ హీరోల పుత్రోత్సాహం
పిల్లలు పుట్టినప్పటికంటే వారు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం కలుగుతుందని అంటారు. అలా ప్రయోజకులైన తమ పిల్లలని చూస్తూ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు 'మెగాస్టార్' చిరంజీవి, 'యువసామ్రాట్' నాగార్జున.
చిరు తనయుడిగా 'చిరుత' చిత్రం ద్వారా పరిచయమైన రామ్ చరణ్ తేజ తొలి సినిమాతోనే అదరగొట్టేసి తండ్రకి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ నటనలోనూ, నృత్యంలోనూ మంచి మార్కులు సంపాదించారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రం రామ్ చరణ్ ప్రతిభాపాటవాలకు అద్దం పడుతూ ఆయన ఇమేజ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేసింది. చాలా మంది హీరోలకు పది, పదిహేను చిత్రాల తర్వాత కానీ రాని ఇమేజ్ ను చరణ్ తన రెండవ చిత్రానికే సొంతం చేసుకున్నారు. 78 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తున్న తన తనయుడి చిత్రాన్ని చూస్తున్న చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక టాలీవుడ్ మరో స్టార్ హీరో నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా 'జోష్' సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్ర ఫలితం ఎలా వున్నా నాగచైతన్య నటన మాత్రం ఆకట్టుకుంది. తొలి చిత్రం ఏ ప్రేమకథో, యాక్షన్ సినిమాయో తీసుకోకుండా కథాబలం వున్న సినిమా చేసి వైవిధ్యాన్ని చాటుకున్నాడు. హావభావాల ప్రకటనలో తన తండ్రి, తాతయ్య ఛాయలు కనిపించకుండా తనదైన శైలిని కనబరిచి తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకోవడానికి ప్రయత్నించాడు. తన అభిమానులంతా ముక్త కంఠంతో 'జోష్' అంటుంటే నాగార్జున పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు.
ఇలా తమ ప్రతిభతో తమ తల్లిదండ్రులకు పుత్రోత్సాహాన్ని ఇచ్చిన తనయులు రామ్ చరణ్, నాగ చైతన్య మరిన్ని సినిమాల్లో నటించి వారి తల్లిదండ్రుల ఆనందాన్ని, ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేయాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











