Waltair Veerayya: చిరంజీవిపై విష ప్రయోగం.. అభిమానంతోనే అంటూ షాకింగ్ విషయం చెప్పిన మెగాస్టార్!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్టీలో ఒక వెలుగు వెలుగుతున్న హీరో చిరంజీవి. స్వయంకృషితో ఎదిగిన ఆయన మెగాస్టార్ గా మారారు. అనేక చిత్రాలతో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ అందిరికా బాస్ గా మారి అందరివాడు అయ్యారు. అలాగే ఎంతో మంది నేటితరం హీరోలకు స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా టాలెంటెడ్ నటులకు బలమైన పాత్రలు అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇండస్ట్రీ సమస్యల గురంచి మాట్లాడుతూ నిజమైన అన్నయ్య అనిపించుకుంటున్నారు. ఇక చిరంజీవికి ఉన్న అభిమానగనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవిపై ప్రేమతో ఒక అభిమాని ఎంతదూరం వెళ్లాడో తాజాగా చెప్పుకొచ్చారు మెగాస్టార్.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ వయులోను యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. ఆచార్యతో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న వెంటనే గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టారు. ఇప్పుడు త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విష ప్రయోగం గురించి..
సంక్రాంతి కానుకగా జనవరి 13న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వాల్తేరు వీరయ్యను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి ఎన్నో ఆసక్తిర విషయాలు చెప్పడంతోపాటు తనపై జరిగిన విష ప్రయోగం గురించి కూడా తెలిపారు.

కేక్ కట్ చేశాను..
"నాపైన విష ప్రయోగం జరిగిందన్నది నిజమే. అప్పుడు మరణ మృదంగం సినిమా చేస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక అభిమాని చేసిన పిచ్చి పని ఇది. హార్స్ క్లబ్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నాం. అప్పుడు ఫ్యాన్స్ చాలామంది నన్ను చూడటానికి వచ్చారు. కొంతమంది ఫ్యాన్స్ వచ్చి నన్ను కేక్ కట్ చేయమన్నారు. నేను కూడా చేశాను" అని చిరంజీవి తెలిపారు.

అందులో ఏదో పౌడర్ ఉంది..
"కేక్ కట్ చేసే సమమయంలో ఒక అభిమాని కేక్ కట్ చేసి.. తన చేతితో నా నోట్లో పెట్టబోయాడు. నిజానికి అలా చేతితో పట్టుకుని పెడితే నాకు ఇష్టం ఉండదు. వద్దు వద్దు అంటూనే ఉన్నా వాడు మాత్రం బలవంతంగా నా నోటిలో కేక్ పెట్టేశాడు. ఆ కేక్ తింటున్నప్పుడు నాకు కాస్త చేదుగా అనిపించింది. పరీక్షించి చూస్తే అందులో ఏదో ఎక్స్ ట్రా పౌడర్ మధ్యలో ఉన్నట్లు అనిపించింది. ఇదేంటి ఇది తేడాగా ఉంది అని మా వాళ్లు పట్టుకుని అడిగితే.. ఏం లేదు ఏం లేదు అని అన్నాడు. అయినా మా వాళ్లు వదల్లేదు" అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

నాతో సరిగా మాట్లాడటం లేదు..
ఇంకా చిరంజీవి కొనసాగిస్తూ "ఆ కేక్ ను టెస్ట్ లకు పంపించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. కేక్ లో వాడిన పౌడర్ లో పాయిజన్ వాడారని రిపోర్ట్ వచ్చింది. ఆ వెంటనే నిర్మాత కేఎస్ రామారావు గారు వాడిని కొట్టేశారు. ఎందుకు ఇలా చేశావని అడిగితే.. చిరంజీవి గారు ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు. వేరే వాళ్లతో ఇంటరాక్ట్ అవడం నాకు నచ్చలేదు. ఆయనకు దగ్గరవ్వలానే కేరళలోని వశీకరణ మందు తీసుకొచ్చి కేక్ లో కలిపాను అని చెప్పాడు" అని పేర్కొన్నారు.

అలాంటి వాడిని ఏం చేస్తాం..
"వశీకరణ కోసం అని చెప్పాక దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. సరేలే అని వదిలేశా. విష ప్రయోగం అదీ ఇదీ అని వద్దులే. పాపం వాడిది అభిమానం అనుకోవాలో.. మూర్ఖత్వం అనుకోవాలో అని అనిపించింది. వాడు మాత్రం అభిమానంతోనే అలా చేశాడు. వశీకరణ మందు కలిపితే వాడిని పట్టించుకుంటానని అలా చేశాడు. అలాంటి వాన్ని ఏం చేస్తాం.. నవ్వి ఊరుకున్నాను" అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.


Click it and Unblock the Notifications











