బాలకృష్ణ నుంచి ఒకేరోజు రెండు సర్ప్రైజ్లు: అదిరిపోయేలా నటసింహా ప్లాన్.. అప్పటి వరకూ ఆగాల్సిందే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. ఏకధాటిగా సినిమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలా సెంచరీ మార్కును దాటేసిన ఆయన.. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమాను చేస్తున్నారు. దీని తర్వాత యంగ్ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానుల కోసం బాలయ్య రెండు సర్ప్రైజ్లు రెడీ చేశారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

వరుస పరాజయాలతో సతమతం
క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ ఒక్కటంటే ఒక్క హిట్ను కూడా అందుకోలేకపోయారు. 2019లో అయితే ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. విజయాన్ని మాత్రం దక్కించుకోలేదు. దీంతో వరుసగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఏవీ ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించలేదు.

బోయపాటితో హ్యాట్రిక్ కోసం రెడీగా
సరైన హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చేస్తోన్న బాలయ్య.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. శ్రీకాంత్ విలన్. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.

రికార్డు క్రియేట్ చేసిన నటసింహం
'అఖండ' మూవీని బాలకృష్ణ కెరీర్లో భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో ఎంతో మంది బడా నటులను తీసుకున్నారు. అలాగే, ఈ మూవీలో నటసింహం అఘోరా పాత్రలోనూ కనిపించబోతున్నారు. వీటితో పాటు ఈ మూవీతో హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నో సాహసాలు చేస్తున్నారు. ఇక, ఆ మధ్య వచ్చిన టీజర్తో టాలీవుడ్లో సరికొత్త చరిత్రను సృష్టించారాయన.

యంగ్ డైరెక్టర్తో మూవీకి సిగ్నల్
బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా పట్టాలపై ఉండగానే.. 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న ఎనర్జిటిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఆరోజు నిరాశ పరిచిన బాలకృష్ణ
మే 28వ తేదీన నందమూరి తారక రామారావు జయంతి. దీనిని పురస్కరించుకుని 'అఖండ' సినిమాను విడుదల చేయాలని భావించాడు బాలయ్య. అయితే, కరోనా ప్రభావం కారణంగా ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో ఆరోజు సినిమాలోని పాటను వదులుతున్నారని ప్రచారం జరిగింది. అలాగే, గోపీచంద్ సినిమా ప్రకటన కూడా ఉంటుందని అన్నారు. కానీ, ఇవేమీ ఇవ్వలేదు బాలయ్య.
Recommended Video

ఒకేరోజు రెండు సర్ప్రైజ్లు సిద్ధం
జూన్ 10న నందమూరి బాలకృష్ణ జన్మదినం. దీని కోసం ఆయన ఎన్నో ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆరోజునే 'అఖండ' సినిమాకు సంబంధించిన టైటిల్ ట్రాక్ను విడుదల చేయబోతున్నారట. అంతేకాదు, గోపీచంద్ మలినేని మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాబోతుందట. అందులోనే సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











