గోవాలో అలాంటి అవమానం.. బాలయ్య అలా చేస్తాడనుకోలేదు.. నిజ స్వరూపం బయటపెట్టిన తమ్మారెడ్డి
ఈ మధ్యకాలంలో సీనియర్ దర్శక నిర్మాతలు సైతం కొంతమంది తమ పేరిట యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వాటి ద్వారా తాము చెప్పాలనుకున్న విషయాన్ని నేటితరం వారికి ఈజీగా అందేలా చేస్తున్నారు.. వారు ప్రస్తుత విషయాల మీదే కాక దాదాపు అన్ని విషయాల మీద కూడా స్పందిస్తూ తమ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గోవాలో జరిగిన అవమానానికి బాలకృష్ణ అలా స్పందిస్తాడని అనుకోలేదు అంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

మీమ్స్, ట్రోల్స్
నందమూరి బాలకృష్ణ తండ్రి వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మీద పెద్దగా నెగిటివిటీ ఉండేది కాదు కానీ సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన మీద మీమ్స్, ట్రోల్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. దానికి తగ్గట్లుగానే ఆయన కొన్ని కార్యక్రమాల్లో తన అభిమానుల మీద చేయి చేసుకున్న వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో ఆయన కోపిష్టి అని అందరూ అనుకునేలా అయింది. అయితే తాజాగా బాలకృష్ణ నిజస్వరూపం ఇదే అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు
ప్రస్తుతానికి సౌత్ నార్త్ అంటూ హీరోల మధ్య కొంత గ్యాప్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముందు ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే సౌత్ హీరోలు కూడా కొంతమంది హిందీ సినిమాలు మా ముందు ఎందుకూ పనికిరావు అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసి నార్త్ నుంచి కూడా కొంత మంది అభిమానులు మన దక్షిణాది సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వాటిని ట్రోల్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ వాళ్ళ సినిమాలు బాగోలేనప్పుడు మనం ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక వీడియో విడుదల చేశారు.

గోవా ఫ్లైట్ లో
దానికి ఉదాహరణ చెబుతూ ఒకానొక సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంద,ని దానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ ఆహ్వానించ వలసిందిగా ఫిలిం ఛాంబర్ ద్వారా తనకు ఫోన్ వచ్చిందని ఆయన అన్నారు. ఆ సమయంలో తాను బాలకృష్ణ గారిని అడిగితే ముఖ్యఅతిథిగా పిలుస్తున్నారు కాబట్టి వెళదామని, అయితే మీరు కూడా రావాలంటూ కండిషన్ పెట్టారు అని అన్నారు. దానికి సరే అనడంతో హైదరాబాద్ నుంచి గోవా ఫ్లైట్ లో వెళ్లామని ఆయన చెప్పుకొచ్చారు.

అవమానించారు
సాధారణంగా గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఆ ఫిలిం ఫెస్టివల్ ఆర్గనైజర్లు ఎవరో ఒకరు వచ్చి అంగరంగ వైభవంగా ముఖ్యఅతిథిని తీసుకుని వెళ్లాలి. కానీ మాకు మాత్రం ఒక మేనేజర్, ఆయన చేతిలో చిన్న బొకే, ఒక ఇన్నోవా కారు ఇచ్చి పంపించారు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. అది చూసి తనకు అవమానంగా అనిపించి నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఇలా అవమానించారు, ఇదే నార్త్ నుంచి ఒక హీరో వస్తున్నారంటే 2,3 బెంజ్ కార్లు పెట్టి కోలాహలంగా ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళేవారు మనకు ఈ అవమానం అవసరమా అంటే బాలకృష్ణ మాట్లాడిన మాటలు తనకు ఆశ్చర్యం కలిగించాయి అని చెప్పుకొచ్చారు.

కళ్ళు తెరిపించారు
అయితే మనం ఇక్కడికి వచ్చింది గౌరవం పొందడానికి కోసం కాదు, ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అంటే అంతకన్నా గౌరవం ఏముంటుంది? ఇక్కడ మనం అవమానంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదని తన కళ్ళు తెరిపించారు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. మనకంటూ ఒక గుర్తింపు ఉంది కాబట్టే కదా వాళ్ళు ఇక్కడి వరకు పిలిచారని ఆయన చెప్పారని, మన అభిమానులు ఆయనకు ఇంత స్థానం ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడికి రాగలిగామని, ఆయన చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు ఆలోచిస్తే అది నిజమే కదా అనిపించిందని తర్వాత దారిలో వెళుతూ ఒక షాపు దగ్గర ఆపి సామాన్యుడిలాగా ఆయన వెళ్లి రెండు కేసుల మంచినీళ్ళ బాటిల్స్ కొనుక్కుని వచ్చారని చెప్పుకొచ్చారు.

సహకారం అందించుకుంటూ
అదేంటి సార్ హోటల్లో మనకు ఇస్తారు కదా అంటే వాడు ఒక బాటిల్ కి 100 రూపాయలు వసూలు చేస్తాడు, మనం అతిధిగా వచ్చి అంత ఖర్చు నిర్వాహకులు చేత ఎలా పెట్టిస్తామని ఆయన ప్రశ్నించారని, ఇదంతా చూసి నేను షాక్ అయ్యానని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేశారు. ఇప్పుడు పుష్ప, కేజిఎఫ్ సినిమాలు బాలీవుడ్లో సత్తా చాటాయి, అలాగే బాహుబలి, RRR సినిమాలు కూడా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే విధంగా ఉన్నాయి. అలా అని మనం వాళ్ళ సినిమాలను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని అలా చేస్తే వాళ్లు మన సినిమాలను కూడా చేస్తారని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఒకరికొకరం సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్లాలి కానీ ఇలా ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











