Sai Pallavi కంటతడి.. దేవుడికి థ్యాంక్స్.. యాంకర్ సుమ ఫైర్ క్రాకర్ అంటూ ఎమోషనల్
టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రచయిత సత్యదేవ్ జంగా అందించిన కథగా శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతున్నది. నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషనల్లో భాగంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్లో గాయకుడు అనురాగ్ కులకర్ణి పాడిన పాటతో సాయిపల్లవి చాలా ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు. సాయిపల్లవి స్టేజ్ మీదకు రాగానే ప్రేక్షకులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టి స్వాగతించారు. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగంతో సాయిపల్లవి మాట్లాడుతూ..

రెండే రెండు నిమిషాలు అంటూ
శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరు నిశ్శబ్దంగా ఉంటే నాకు ఏదో చెప్పాలని ఉంది. రెండే రెండు నిమిషాలు ఓపికగా ఉండండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, నానీ ఫ్యాన్స్, ఫ్యాన్స్ అందరికి నమస్కారం. అనురాగ్ కులకర్ణి స్టేజ్పై పాడిన పాట తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే లైవ్లో ఒక వ్యక్తి ఎమోషనల్ కావడమనేది అందరికి సాధ్యపడదు. అది దేవుడు ఇచ్చిన వరం. ఎప్పుడో మొదలు పెట్టిన ఏడుపు ఇప్పటి వరకు ఆగలేదు అని సాయిపల్లవి అన్నారు.

నాకు దేవుడు ఇచ్చిన వరం
కళ అనేది దేవుడు ఇచ్చిన వరం. సరస్వతి దేవి అందరికి ఆ కళ ఇస్తుంది. కానీ హర్డ్ వర్క్ చేసి కొంతమంది తమ రంగంలో స్థిరపడుతున్నారు. అలాంటి కళలో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం యాంకర్ సుమ ఉందనుకొండి. ఆమె స్టేజ్ ఎక్కే వరకు ఆమె మైండ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ అవన్నీ మరిచిపోయి స్టేజ్ మీద ఫైర్ క్రాకర్గా చెలరేగిపోతుంది. అలాగే సెట్స్పైకి వచ్చిన తర్వాత వారి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు. పాత్రలోనే లీనమైపోయి తమ బెస్ట్ ఇవ్వాలని కోరుకొంటారు అని సాయిపల్లవి చెప్పారు.

నాపై నమ్మకం పెట్టుకొని
నా కెరీర్ మొదలుపెట్టినప్పుటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఆలోచిస్తాను. అందరి మాదిరిగానే తమకు ప్రతిభతో తమకు ఇష్టమైన కళారంగంలో రాణించాలని కోరుకొన్నట్టే నేను నాకున్న టాలెంట్పై నమ్మకం పెట్టుకొన్నాను. అది డ్యాన్స్ కానీ, నటనలో కానీ నాకు ఒక అవకాశం వచ్చింది. నన్ను నమ్మి రోల్స్ ఆఫర్లు ఇచ్చినందుకు ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. శ్యామ్ సింగరాయ్లోని పాటలో గానీ, సీన్లలో గానీ నటించినప్పుడు చాలా హర్డ్ వర్క్ చేసిందని చెప్పారు. కానీ నాకు గుర్తు లేదు. నాకు ఆ సమయంలో ఇచ్చిన టాస్క్ను ఇష్టపడి.. ఎంజాయ్ చేస్తూ చేశాను అని సాయిపల్లవి చెప్పారు.

నటిగా నన్ను అంగీకరించి..
తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా నన్ను అంగీకరించారు. మొదటి సినిమా తర్వాత ఈ అమ్మాయి బాగా చేయలేదనే ఫీలింగ్ కలిగితే ఇలా అవకాశాలు వచ్చి ఉండేవి కావు. నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లకు, నన్ను దృష్టిలో పెట్టుకొని రోల్స్ రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నటీనటులపై నమ్మకం పెట్టి నిర్మాత వెంకట్ చాలా ఖర్చు పెట్టారు. సెట్స్, పాటలు, రకరకాల అంశాలు మమల్ని ప్రభావితం చేశాయి. మాలోని ప్రతిభను గొప్పగా బయటకు తీశాయి. నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు స్టేజ్పై ఏడుస్తానని అనుకొన్నాను. కానీ ఈ రోజు ఓ పాట నన్ను కదిలించడంతో భావోద్వేగంతో ఏడ్చాను. యాక్టర్గా ఈ ఆర్ట్ ఫామ్లో ఉండటమే నాకు గొప్ప అవార్డు అని సాయిపల్లవి అన్నారు.

ఇలాంటి గొప్ప జీవితం ఇచ్చినందుకు
స్టేజ్ మీద ఉంటే..ఫైర్, బేబమ్మ, భానుమతి, ఫిదా అంటూ ప్రేక్షకులు అరుస్తుంటే.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇలాంటి ప్రశంసలు అందుకోవడం చాలా ఎమోషనల్గా ఉంది. ఇలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొంటాను. ఈ సినిమా కోసం తెర వెనుక పనిచేసిన మిక్కి జే మేయర్, నీరజ కోన లాంటి వాళ్ల గురించి మాట్లాడాలి. అభిమానులు చూపించే ప్రేమలో తడిసి ముద్దవుతుంటాను. నన్ను నటిగా గుర్తించిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను అని సాయిపల్లవి చెప్పారు.


Click it and Unblock the Notifications











