‘ఆ మూవీలో నాతో అలాంటి సీన్లు.. తెలుగులో ఎప్పటికీ నటించను’
కమిలినీ ముఖర్జీ.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీసెంట్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. గ్లామర్ రోల్స్కు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అలరించారు. ఏం జరిగిందో ఏమో కానీ తెలుగు తెర నుంచి కమిలినీ ఒక్కసారిగా దూరమయ్యారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెలుగులో సినిమాలు చేయకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కమిలినీ ముఖర్జీ. ఈ వివరాల్లోకి వెళితే..
ఆనంద్తో టాలీవుడ్లో ఎంట్రీ
కోల్కతాకు చెందిన కమిలినీ ముఖర్జీ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్టేజ్పై చిన్న చిన్న నాటకాలు వేస్తూ అలరించారు. భరతనాట్యం నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ఢిల్లీలో హోటల్ మేనేజ్మెంట్ చేయాలని వెళ్లారు. అయితే సినిమాలపై ఆసక్తితో మధ్యలోనే వచ్చేసి థియేటర్ కోర్స్ చేయడానికి ముంబైలో వాలిపోయారు. 2004లో హిందీలో పిర్ మిలెంగే సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టిన కమిలినీ ముఖర్జీ.. ఆ తర్వాత ఆనంద్తో తెలుగువారిని పలకరించారు.

ఆనంద్తో అవకాశాలు క్యూ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రూప పాత్ర పోషించారు కమిలినీ. పద్ధతిగా చీరకట్టుతో, చిరునవ్వులు చిందించి కనిపించిన ఆమె కొన్నాళ్ల పాటు కుర్రాళ్లకు కలల రాకుమారిగా నిలిచింది. తమకు కాబోయే అమ్మాయి అచ్చం కమిలినీలాగే ఉండాలని కోరుకున్నారు యువత. ఆనంద్ తర్వాత ఆమెకు వరుసపెట్టి అవకాశాలు క్యూకట్టాయి. తర్వాత మీనాక్షి, స్టైల్, గోదావరి, క్లాస్మేట్స్, పెళ్లయ్యింది కానీ, గమ్యం, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపికా గోదావరి, నాగవల్లి, విరోధి, గోవిందుడు అందరివాడేలే సినిమాలలో నటించారు.
20 ఏళ్లకు పైగా కెరీర్
20 ఏళ్లకు పైగా కెరీర్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో పలు సినిమాలలో నటించారు కమిలినీ ముఖర్జీ. అయితే మలయాళంలో 2016లో మోహన్లాల్ సరసన పులి మురగన్లో కనిపించిన కమిలినీ ఆ తర్వాత తెరకు దూరమయ్యారు. దాదాపు 8 ఏళ్లుగా వెండితెర కానీ, బుల్లితెరపై కానీ ఆమె కనిపించలేదు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరమైంది? ఏ కారణం వల్ల సినిమాలు చేయడం లేదు? అనే ప్రశ్నలకు కమిలినీ ముఖర్జీ సమాధానం చెప్పారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమలో తాను మంచి పాత్రలు దక్కాయని, అన్నీ బలమైన స్త్రీ పాత్రలేనని కమిలినీ తెలిపారు.
ఆ సినిమాలో పాత్ర చూసి బాధపడ్డా
కాలం గడిచేకొద్దీ తనకు తెలుగులో ఆ తరహా పాత్రలు రావడం తగ్గిపోయిందని, గోవిందుడు అందరివాడేలే సినిమాలో తనకు సరైన పాత్ర పడలేదని ఆమె ఆరోపించారు. షూటింగ్ పూర్తయ్యాక చూసుకుంటే ఆ పాత్ర నాకే ఇబ్బందిగా అనిపించిందని, ఎంతో బాధపడ్డానని కానీ ఎవరితోనూ ఘర్షణను కోరుకోలేదని కమిలినీ తెలిపారు. అలాగే సినిమాలలో అవసరం లేదనుకుంటే నటీనటుల అనుమతితో పనిలేకుండా సీన్లు లేపేస్తారని.. ఎంతో కష్టపడి చేసిన సీన్లు, డైలాగులు కట్ చేస్తే ఎంతో బాధగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను తాను తేలికగా తీసుకోలేనని, అలాగని తనకు ఎవరి మీదా కోపం లేదని కమిలినీ ముఖర్జీ తెలిపారు. అందుకే ఈ సినిమా తర్వాత తెలుగులో ఇక సినిమాలు చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నానని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పుడు భార్య పాత్రలోకి
2016లో పులి మురుగన్ సినిమా సమయంలో తనకు వివాహం జరిగిందని, ఇప్పుడు భార్యగా భర్త, పిల్లలను చూసుకుంటూ నా బాధ్యతను నెరవేరుస్తున్నానని కమిలినీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అన్నట్లు గోవిందుడు అందరివాడేలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్లు హీరో హీరోయిన్లుగా నటించగా.. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











