కియారా అద్వానీకి టాప్ ప్రొడ్యూసర్ దారుణమైన శిక్ష? డేంజర్లో హీరోయిన్ కెరీర్?
సినిమాల కోసం ఎంతో కష్టపడినప్పటికీ హీరోయిన్లకు దక్కాల్సిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదు. హీరోలు, ఇతర క్యాస్టింగ్ వచ్చినా, రాకపోయినా ఖచ్చితంగా హీరోయిన్లు మాత్రం ప్రమోషనల్ భారాన్ని తమ భుజాన వేసుకుని కష్టపడతారు. సినిమా హిట్ అయితే హీరోలు, దర్శకులకే ఆ క్రెడిట్ వెళ్తుండగా... హీరోయిన్లను పట్టించుకునేవారే ఉండరు. ఇక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్లదే తప్పు అన్నట్లుగా అభియోగాలు వేస్తారు. ఇదే అంశంపై గతంలో హీరోయిన్ శృతిహాసన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని, కానీ హీరోలను మాత్రం పల్లెత్తు మాట అనలేదని మండిపడ్డారు.
కల్కి 2 నుంచి దీపిక పదుకొనె ఔట్
అసలే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. కంటిన్యూగా హిట్స్ ఇస్తే ఓకే, లేదంటే వారి సినీ ప్రయాణం ముణ్నాళ్ల ముచ్చటే. సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల విషయంలోనే కఠిన నిర్ణయాలు జరుగుతుంటాయని ఎన్నోసార్లు రుజువైంది. ఇక ఇటీవల కల్కి 2898 ఏడీకి సీక్వెల్గా తెరకెక్కిస్తోన్న కల్కి 2 నుంచి హీరోయిన్ దీపిక పదుకొనెను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తప్పించిన వ్యవహారం టాలీవుడ్, బాలీవుడ్లలో హాట్ టాపిక్గా మారింది.

నిబద్ధత కావాలన్న వైజయంతీ మూవీస్
కల్కి 2898 ఏడీ నుంచి నేటి వరకు సుదీర్ఘ ప్రయాణం కొనసాగించినప్పటికీ దీపికకు, తమకు మధ్య సరైన భాగస్వామ్యం కుదరలేదని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ కలిగిన కల్కి 2 వంటి చిత్రానికి నిబద్ధత అవసరమని నొక్కి చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ నుంచి కూడా దీపిక తప్పుకోవడం ఆమె కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
8 గంటల డ్యూటీ చుట్టూ వివాదం
భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో సౌకర్యాలు కల్పించాలని దీపిక గొంతెమ్మ కోర్కెలు అడిగారని చెబుతున్నారు. అయితే ఇలాంటివి ఇండస్ట్రీలో అత్యంత సహజం.. వాటిని నిర్మాతలు పట్టించుకోరు. కానీ ప్రధానంగా 8 గంటల వర్క్ అనేది దీపికను తప్పించడానికి కారణం అంటున్నారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్తో తెరకెక్కే సినిమాలలో 8 గంటల పని అనేది కష్టమని పలువురి వాదన. దీనిపై దీపిక కూడా తన స్పందన తెలియజేశారు కూడా. తాజాగా దీపిక పదుకొనె బాటలోనే మరో స్టార్ హీరోయిన్కు ఉద్వాసన ఎదురైంది. ఆమె ఎవరో కాదు... బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న కియారా అద్వానీ.
డిజాస్టర్గా వార్ 2
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 చిత్రం డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కావ్య లుథ్రాగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ రోల్ పోషించారు కియారా. హృతిక్తో లిప్లాక్తో పాటు కెరీర్లో తొలిసారిగా బికినీ వేసి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. అన్ని చేసినా వార్ 2 ఫెయిల్యూర్ కావడంతో ఆమె కెరీర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వార్ 2 హిట్ అయ్యుంటే తన స్పై యూనివర్స్ను మరింత విస్తరించాలని, అలాగే కియారాను ఓ మూడు సినిమాలలో హీరోయిన్గా తీసుకునేందుకు యశ్ రాజ్ ఫిలింస్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
కియారా కెరీర్పై దెబ్బ
కానీ వార్ 2 డిజాస్టర్ కావడంతో తన స్పై యూనివర్స్ ప్రాజెక్ట్స్ను పున: సమీక్షించాలని వైఆర్ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రా భావిస్తున్నట్లుగా బాలీవుడ్ టాక్. దీనికి తోడు ఇటీవలే కియారా తల్లి కావడంతో ప్రస్తుతం మేటర్నిటీ బ్రేక్ కారణంగా సినిమాలకు విరామం ప్రకటించారు. దీంతో కియారాతో ఒప్పందం కుదుర్చుకున్న 3 ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను యశ్ రాజ్ ఫిలింస్ తప్పించినట్లుగా బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. అదే జరిగితే కియారా కెరీర్కు ఇది కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











