హత్య కేసులో సూత్రధారి .. నడుం నొప్పంటూ ఎంక్వైరీకి డుమ్మా.. స్పెషల్ షోకు స్టార్ హీరో
తన వీరాభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అరెస్ట్ కావడం శాండల్వుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. సెలబ్రెటీగా ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అభిమానిని హత్య చేయడం, ఆపై శవాన్ని మాయం చేయడానికి ఏర్పాట్లు , జైలులో రాచమర్యాదలు పొందడం వంటి అంశాలతో దర్శన్ విమర్శలను ఎదుర్కొన్నాడు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు.
దర్శన్ తీరు తొలి నుంచి వివాదాస్పదమే.. తన కో స్టార్ నిఖితతో గతంలో ఆయన రిలేషన్లో ఉన్నట్లు వార్తలు రావడంతో కన్నడ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అలాగే దర్శన్ తనను వేధిస్తున్నారంటూ కట్టుకున్న భార్య పోలీసులను ఆశ్రయించడం అంతే వివాదాస్పదమైంది. ఈ కేసులో దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కొద్దిరోజులు జైళ్లో ఉండొచ్చాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల నుంచి నటిగా, ఫ్యాషన్ డిజైనర్ అయిన పవిత్ర గౌడ అనే వివాహితతో దర్శన్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. మనస్పర్ధల కారణంగా పవిత్ర గౌడ భర్త నుంచి విడిపోయి దర్శన్కు దగ్గరైందనే ఆరోపణలు ఉన్నాయి.

అక్కడితో ఆగకుండా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, దర్శన్తో దిగిన ఫోటోలను పవిత్ర గౌడ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దుమారం రేపింది. ఈ క్రమంలో రేణుకా స్వామి అనే దర్శన్ అభిమాని ఇది జీర్ణించులేకపోయాడు. పవిత్ర తన అభిమాన నటుడి జీవితాన్ని నాశనం చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవాడు. ఆమెకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపడంతో వ్యవహారం దర్శన్ వరకు వెళ్లింది.
రేణుకా స్వామి ఆగడాలపై రగిలిపోయిన దర్శన్ తన అభిమాని అనికూడా చూడకుండా హత్య చేయాలని పథకం రెడీ చేశాడు. చిత్రదుర్గలో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరు పట్టణగెరెలో ఉన్న షెడ్లో బంధించారు. ఆపై దర్శన్ అతని అనుచరులు రేణుకా స్వామికి కరెంట్ షాకిచ్చి, చిత్రహింసలు పెట్టారు. రేణుకా స్వామిని టార్చర్ చేస్తున్నప్పుడు పవిత్ర స్పాట్లోనే ఉన్నారని వార్తలు వచ్చాయి.
చికిత్స చేయించుకోవాలనే అభ్యర్ధనపై దర్శన్కు కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయన దాదాపు నాలుగు నెలల తర్వాత బయటికి వచ్చారు. బెయిల్పై వచ్చినప్పటికీ రేణుకా స్వామి కేసును పోలీసులు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే 231 సాక్ష్యాలతో 3,991 పేజీల ఛార్జ్షీటును పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. తాజాగా దర్శన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది . రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి మంగళవారం జరిగిన కోర్ట్ విచారణకు దర్శన్ డుమ్మా కొట్టాడు.
నడుం నొప్పి కారణంగా దర్శన్ విచారణకు హాజరుకాలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే విచారణకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సాకులు చెప్పి విచారణకు హాజరు కాకపోవడం ఏంటని న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. ఆ కాసేపటికే దర్శన్ వామన చిత్రం స్పెషల్ స్క్రీనింగ్కు హాజరుకావడం కలకలం రేపుతోంది. స్క్రీనింగ్లో పాల్గొనడంతో పాటు సినిమా చూసిన అనంతరం దర్శన్ మీడియాతోనూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరి దీనిపై దర్శన్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











