దర్శన్ కేసులో మరో ట్విస్టు.. రేణుకస్వామి హత్యకు ఎన్ని లక్షల సుపారీ ఇచ్చారంటే?
రేణుక స్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అరెస్ట్ అయిన విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్షలాది మంది అభిమానించే సినీ హీరో వెండితెరపై విలన్ను మరిపించేలా చేసిన అకృత్యాలు ముక్కున వేలేసుకొనే పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసుల విచారణలో దర్శన్ వెల్లడిస్తున్న విషయాలు దిమ్మెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాల్లోకి వెళితే...
తనతో సహజీవనం చేస్తున్న నటి, ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడను అసభ్య సందేశాలు, పోస్టులతో వేధించిన తన అభిమాని రేణుక స్వామిని దర్శన్తోపాటు ఆయన అనుచరులు దారుణంగా కొట్టడంతో మరణించిన కేసు సంచలనం రేపుతున్నది. గత వారం రోజులుగా బయటకు వస్తున్న విషయాలు అభిమానులను సైతం నివ్వరపోయేలా చేస్తున్నది.

రేణుకస్వామి కేసులో అరెస్టైన దర్శన్ను ఏ2గా బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. ఇక పవిత్ర గౌడను ఏ3గా పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చి వారిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. విచారణలో భాగంగా దర్శన్ తన చేసిన ప్లాన్స్, వ్యవహరించిన విషయాలను పోలీసులకు చెప్పినట్టు తెలుస్తున్నది.
కన్నడ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. తన ప్రియురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి బుద్ది చెప్పాలని దర్శన్ నిర్ణయించుకొని తన అనుచరులకు సూచనలు ఇచ్చారు. దాంతో వారు అతడిని కిడ్నాప్ చేసుకొని వచ్చి తన ఫామ్హౌస్లో బంధించారు. ఆ తర్వాత నేను కూడా కొట్టాను. అతడిని కొట్టిన తర్వాత వదిలేయమని చెప్పాను. కానీ అతడు దెబ్బలకు తాళలేక మరణించాడు అని చెప్పినట్టు సమాచారం.
సుమనహళ్లిలో జరిగిన సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. నిందితులు చెప్పిన విషయాల ఆధారంగా ఓ ఫ్లాట్లో ఉంచిన కర్రలు, ఇనుప రాడ్లు, వాటర్ బాటిల్స్. అక్కడ పడిన రక్తపు నమూనాలను పోలీసులు సేకరించి వాటిని ఫొరెన్సిక్ లాబోరేటరీకి పంపించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక దర్శన్ విచారణలో సంచలన విషయాన్ని ఒప్పుకోవడంతో ఈ కేసులో పక్కా అధారాలు లభించాయి. ఈ కేసులో ఏ14గా ఉన్న ప్రదోష్ అనే యువకుడికి 30 లక్షల సుపారీ చెల్లించినట్టు అంగీకరించడం ఈ కేసులో మరో మలుపు తిరిగేలా ఉంది. అయితే రేణుక స్వామిపై దాడి చేయడానికి ఉపయోగించాలని తన అనుచరులకు చెప్పినట్టు ఓప్పుకొన్నారని పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











