lata mangeshkar funeral: ఇళయరాజా, సచిన్ టెండ్కూలర్ భావోద్వేగం.. ట్వీట్ చేసి కంటతడి పెట్టినంతగా..
భారతరత్న పురస్కార గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్త యావత్ సంగీత ప్రపంచాన్ని కలిచివేసింది. ఏడు దశాబ్దాలుగా సంగీత అభిమానుల గుండెల్లో గూడుకట్టుకొన్న లతా ఇక లేరనే గుండెలు పగిలేలా చేసింది. ఆమె లేని లోటు ఇక తీర్చలేనిది అంటూ కోట్లాది మంది అభిమానులు, ప్రముఖులు తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గతనెల కరోనావైరస్ వ్యాధితో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే పలు అవయవాలు పనిచేయకపోవడం వల్ల ఆదివారం ఉదయం 8.12 నిమిషాలకు లతా మంగేష్కర్ శాశ్వత నిద్రలోకి జారుకొన్నారు. ఆమె మరణంపై సంగీత మాంత్రికుడు ఇళయరాజా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

నా అదృష్టంగా భావిస్తా..
లతా మంగేష్కర్ మరణవార్తతో నా హృదయం ముక్కలైంది. లతతో పరిచయం, ఆమెతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తా. గాయనిగానే కాకుండా, వ్యక్తిగా అద్భుతం. మా హృదయంలో మీరు సుస్థిరం చేసుకొన్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మీరు, గాన మాధుర్యంతో అంతగా మా జీవితాలపై ముద్రవేసుకొన్నారు అని ఇళయరాజా ట్వీట్ చేశారు.

ఈ విషాదం నుంచి ఎలా బయటపడాలి..
భారతీయ సంగీత రాంగానికి ఏడు దశాబ్దాలపాటు సేవలందించారు. తన గాంధర్వ గళంలో సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్దుల్ని చేశారు. ఆమె మరణంతో తీవ్రంగా కలత చెందాను. ఆమె మరణంతో ఏర్పడిన లోటు ఎవరూ పూడ్చలేరు. ఈ విషాదం నుంచి ఎలా బయటపడాలో అర్ధం కావడం లేదు. సంగీత ప్రపంచానికే కాదు.. మొత్తం ప్రపంచానికే ఆమె మరణం తీరని లోటు. ఆమె మరణంతో విషాదంలో కూరుకుపోయిన ఆషాజీ, హృదయనాథ్ జీ, ఉషాజీ, ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని వీడియోలో ఇళయరాజా పేర్కొన్నారు.

లతా దీదీ జీవితంలో ఓ భాగం
లతా మంగేష్కర్ మరణంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. లతా దీదీ జీవితంలో ఓ భాగం అయినందుకు అదృష్టంగా భావిస్తాను. ప్రతీసారి ఆమె అందించిన దీవెనల్లో తడిముద్దయ్యాను. ఆమె మరణం వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు. మ్యూజిక్ ద్వారా మా హృదయాల్లో సుస్థిరంగా ఎప్పుడూ ఉండిపోతారు అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

శివాజీ పార్కులో అంత్యక్రియలు
ఇదిలా ఉండగా, లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, ఉద్దవ్ థాకరే, షారుక్ ఖాన్, శ్రద్దాకపూర్, సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు. అధికార లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు కడసారి ఆమెను దర్శించుకొన్నారు.


Click it and Unblock the Notifications











