Lata Mangeshkar హాస్పిటల్లో చేరిక.. కరోనావైరస్ కారణంగా ఐసీయూలో చికిత్స
హిందీ చిత్ర పరిశ్రమను కరోనావైరస్ థర్డ్ వేవ్ వెంటాడుతున్నది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు కరోనావైరస్ దాడికి గురవుతున్నారు. తాజాగా దేశం గర్వించదగిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా ఈ జాబితాలో చేరారు. 92 ఏళ్ల వయసులో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేర్పించారు. తాజా సమాచారం ప్రకారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లోని ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి అప్డేట్
లతా మంగేష్కర్ సన్నిహితులు, ఆమె మేనకోడలు రచన వెల్లడించిన ప్రకారం.. లతా మంగేష్కర్ ఆరోగ్యం బాగుంది. ముందుస్తు చర్యగా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించండి. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా చూసుకోవాలని ప్రార్థిస్తున్నాం అని తెలిపారు.

గతంలో కూడా అనారోగ్యంతో
లతా మంగేష్కర్ ఆరోగ్యం విషయానికి వస్తే.. 2019 నవంబర్లో శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటల్లో చేరారు. ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. వయోభారం కారణంగా ఇటీవల కాలంలో ఆమె సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇటీవలే 92వ జన్మదినం
లతా మంగేష్కర్ గతేడాది సెప్టెంబర్లో 92వ జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు పాలుపంచుకొన్నారు. ఈ సందర్బంగా అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video

లతా మంగేష్కర్ సినిమా కెరీర్ ఇలా..
లతా మంగేష్కర్ కెరీర్ విషయానికి వస్తే.. 1942లో గాయనిగా కెరీర్ ప్రారంభించారు. తన తండ్రి మరణంతో ఇంటి బాధ్యతలు భుజానికి ఎత్తుకొని గాయనిగా రాణించే ప్రయత్నం చేశారు. కిటి హాసల్ అనే చిత్రం కోసం సదాశివరావు నేవ్రేకర్ సంగీతం సమకూర్చిన నాచూ యా గధే అనే పాటను పాడటం ద్వారా కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏడు దశాబ్దాలకుపైగా తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఆలరించారు. వేలాది పాటలతో రికార్డులు సృష్టించారు. దేశంలోనే అత్యున్నత అవార్డులు ఆమె ఖాతాలో చేరాయి.


Click it and Unblock the Notifications











