National film Awards కాపీ క్యాట్ నుంచి జాతీయ అవార్డు వరకు.. వాళ్ల నోళ్లకు తాళం.. తమన్ మ్యూజిక్ జర్నీ!
ఇప్పటికే పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమకు మరోసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా అరుదైన గుర్తింపు లభించింది. గతే రెండేళ్లుగా కరోనా లాక్డౌన్తో సినీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతే.. దేశానికి దిశానిర్దేశం చేయడంలో తెలుగు సినిమా ముందుంది. దేశ సినీ రంగానికి చేయూతనిస్తున్న తెలుగు తేజాలకు జాతీయ చలన చిత్ర అవార్డుల రూపంలో మరింత ఉత్సాహం దక్కింది.
తాజాగా కేంద్రం ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్కు గొప్ప గౌరవం దక్కింది. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకోబోతున్న తమన్ మ్యూజిక్ జర్నీ గురించి..

15వ ఏటనే మ్యూజిక్ ప్రపంచంలోకి
ఎస్ఎస్ థమన్ విషయానికి వస్తే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఘంటసాల బలరామయ్య మనవడిగా, ప్రఖ్యాత డ్రమ్మర్ ఘంటసాల శివకుమార్ కుమారుడిగా తన 15వ ఏటనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 1994లో రూపొందిన భైరవద్వీపం సినిమాకు సహాకారం అందించిన తమన్.. ఆ తర్వాత ఖుషీ సినిమాలో యే మేరా జహా పాటకు ట్యూన్ అందించారు. ఆ తర్వాత శంకర్ రూపొందించిన బాయ్స్ సినిమాలో నటుడిగా కూడా కనిపించాడు.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్గా సెన్సేషనల్గా
తమిళంలో సిందానై సీ, తెలుగులో మల్లి మల్లీ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్గా అవతారం ఎత్తాడు. కిక్, బృందావనం, దూకుడు, బిజినెస్ మ్యాన్, ఇటీవల విడుదలైన అరవింద సమేత, అలా వైకుంఠపురంతో, అఖండ, భీమ్లా నాయక్ చిత్రాలతో అగ్ర సంగీత దర్శకుడిగా తమన్ తన స్టామినాను ప్రపంచానికి చాటారు.

కాపీ క్యాట్ ఆరోపణలపై తమన్
అయితే కెరీర్ ఆరంభంలో పాప్, విదేశీ ట్యూన్లను కాపీ కొడుతున్నారనే ఆరోపణలు తమన్పై వచ్చాయి. పలు ట్యూన్లు కూడా అందుకు సాక్ష్యంగా నిలవడంతో నిజమేనా అనే అనుమానం కలిగింది. అయితే ఓ ఇంటర్యూలో కాపీ చేయడంపై వివరణ ఇస్తూ.. ఓ సక్సెస్ఫుల్ ట్యూన్ తీసుకోవాలని నిర్మాత, దర్శకుడు చెబితే చేయాల్సిందే. ప్రొడ్యూసర్ని కాదని మ్యూజిక్ చేయలేం. ట్యూన్ కాపీ చేయాలని ఏ మ్యూజిక్ డైరెక్టర్ ప్రయత్నించడు. అలాంటి చెడ్డపేరు ఎవరైనా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారా అని తమన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

అలా వైకుంఠపురంతో విశ్వవ్యాప్తంగా
తమన్ మ్యూజిక్ కెరీర్ 2018కి ముందు ఒకలా ఉంటే.. ఆ తర్వాత రాకెట్ స్పీడ్ అందుకొన్నది. వరుణ్ సందేశ్ మూవీ తొలి ప్రేమతో సంగీత ప్రియులకు కొత్త తమన్ కనిపించాడు. అరవింద సమేత వీర రాఘవతో మరో మెట్టు ఎక్కాడు. ఇక అలా వైకుంఠపురంతో తన సంగీతాన్ని విశ్వవాప్తం చేశారు. మ్యూజిక్ పరంగా ఎవరు అందుకొని ఎత్తుకు ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.

అఖండతో చెలరేగిపోయి..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ చెలరేగిపోయాడు. అప్పటి వరకు రాతకే పరిమితమైన బాక్సులు బద్దలయ్యాయి అనే మాటకు అఖండతో నిజరూపం కల్పించాడు. తమన్ అందించిన బీజీఎంతో పలు థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవ్వడం ఆయన ప్రతిభకు, మ్యూజిక్ పట్ల అతడి అంకితభావానికి అద్దం పట్టింది. ఆ తర్వాత భీమ్లా నాయక్తో మరింత చెలరేగిపోయాడు. క్యాపీ క్యాట్ అంటూ ఆరోపణలు చేసిన విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు.

తమన్ ప్రతిభకు పట్టం కట్టిన కేంద్రం
ఇలా దినదినాభివృద్ది చెందుతున్న తమన్కు అందాల్సిన గౌరవం జాతీయ అవార్డు రూపంలో పలకరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసింది. ఇలాంటి అవార్డులు ఇక ముందు ఇంకా సాధించాలని తమన్కు Filmibeat Telugu శుభాకాంక్షలు అందిస్తున్నది.


Click it and Unblock the Notifications











