బాహుబలి సక్సెస్ కారణం అదే... 2.0 భారత చిత్ర సీమ గర్వపడే మూవీ: రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.
సినిమా తెలుగు వెర్షన్ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ దిల్ రాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్కు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు.
రజనీకాంత్ మాట్లాడుతూ... గతంలో రోబో సినిమా 2డిలో తీసి తర్వాత 3డిలోకి కన్వర్ట్ చేద్దామని అనుకున్నాం. దాని తర్వాత ఒక రీల్ కన్వర్ట్ చేసి చూసిన తర్వాత శంకర్ ఒకటే డిసైడ్ అయ్యాడు. 3డికి అవసరమైన సరైన సబ్జెక్ట్ దొరికినపుడే 3డి సినిమా చేయాలి, ఏదో 3డి చూపించాలని చేస్తే బావుండదని దాన్ని ఆపేశారు.

అందుకే బాహుబలి అంత పెద్ద హిట్టయింది
మూడేళ్ల క్రితం శంకర్ నా వద్దకు 3డి సినిమా సబ్జెక్ట్ అని చెప్పి వచ్చినపుడే అర్థమైంది. ఆయనతో ఇంతకు ముందు సినిమా చేశాను కాబట్టి ఇది సాధ్యమేనా? అనే సందేహమే నాకు రాలేదు. ఆయన ఒక మెజీషియన్. బాహుబలి అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం సబ్జెక్ట్. ఆ సబ్జెక్టుకు తగిన విధంగా సినిమాలో పెద్దతనం, బ్రహ్మాండం చూపించారు. ఆ రెంటి కలయిక ఉంది కాబట్టే సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది.

2.0లో కూడా ఆ సత్తా ఉంది
2.0లో టెక్నాలజీ, 3డి దానికి సరిపోయే ఒక మంచి సబ్జెక్ట్ ఉంది కాబట్టి తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సబ్జెక్టు, టెక్నీలజీ కాంబినేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఈ సినిమాకు శంకర్ ఏమి అడిగారో అవన్నీ సమకూర్చిన నిర్మాతకు హాట్సాఫ్.

ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉన్నాయి
ఈ సినిమాకు ప్రమోషన్స్ అవసరమే లేదు. ఎన్వీ ప్రసాద్ అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉన్నాయి. పిక్చర్ ఎప్పుడొస్తుందా? అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్సే దీన్ని ప్రమోట్ చేస్తారని గతంలో నేను చెన్నైలోనే చెప్పాను.

43 ఏళ్ల తర్వాత అలాంటి ఎగ్జైట్మెంట్ నాలో కలిగింది
నా మొదటి చిత్రం అపూర్వ రాగంగళ్ వచ్చినపుడు చూడాలని ఎంత ఎగ్జైట్మెంటుతో ఉన్నానో... 43 ఏళ్ల తర్వాత 2.0 చిత్రం చూడాలని అంత క్యూరియాసిటీ నాలో మొదలైంది. డబ్బింగ్ చెప్పేపుడు సినిమా చూస్తాం. కానీ ఇందులో 35 నుంచి 45 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం సినిమా చూసే అవకాశం ఉండదు.

ఇండియన్ సినిమా పరిశ్రమ గర్వపడే సినిమా
మీరు ఇప్పటి వరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా చూసి అందరూ ఆశ్చర్య పోతారు. ఇండియన్ సినిమా పరిశ్రమ గర్వపడే సినిమా అవుతుంది. శంకర్, ఆయన టీం, నిర్మాత, అక్షయ్ కుమార్ ఎఫర్ట్ అన్నీ కలిపి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని నమ్మకం ఉంది. శంకర్ చెప్పినట్లు ఈ సినిమాను 3డిలో చూస్తే ఆ ఎఫెక్ట్ డిఫరెంటుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











