డబల్ డోస్ కామెడీతో మహేష్ బాబు ‘ఆగడు’
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన 'దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో చిత్రం ఆగడు.
దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగుల్లో మహేష్ బాబు, వెన్నెల కిషోర్, ఎంఎస్ నారాయణలపై కామెడీ సీన్లు చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 4 వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.
ఎంటర్టెన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' చిత్రానికి డబల్ డోస్లా ఉంటుందని శ్రీను వైట్ల ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకు తగిన విధంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications












