వాణిశ్రీ వల్ల అంతా పోయింది, ఆస్తులు అమ్ముకున్నాం: కాంతారావు తనయుడు రాజా
Recommended Video

ఒకప్పుడు తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా కాంతారావు తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత జానపద చిత్రాల్లో ఎనలేని కీర్తి సంపాదించారు. ముఖ్యంగా కత్తియుద్దాల్లో కాంతారావు పెర్పార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో రంజింప చేసేది. హీరోగా 100 సినిమాలు చేయడంతో పాటు 500లకు పైగా చిత్రల్లో వివిధ పాత్రలు పోషించారు. తాను హీరోగా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో బాగా సంపాదించిన కాంతారావు.... చివరకు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. భూములు, ఆస్తులతో పాటు చెన్నైలో ఇల్లు కూడా అమ్మేసుకుని హైదరాబాద్ వచ్చి అద్దెఇంట్లో జీవించాల్సిన పరిస్థితికి వచ్చారు. ఉన్న కాస్త డబ్బు కూడా చివరి రోజుల్లో ఆయన క్యాన్సర్ చికిత్సకోసం కరిగిపోయింది. తమ కుటుంబం ఇలా కావడానికి గల కారణాలను కాంతారావు కుమారుడు రాజా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఒకప్పుడు రాజుల్లా బ్రతికాం....
ఒకప్పుడు తమ కుటుంబం రాజుల్లా బ్రతికింది. తమకు మద్రాసులో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండేదని, కార్లో తిరగడం తప్ప బస్సు ఎక్కడం తెలియదని, అయితే తమ ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఇపుడు ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవమే అని కాంతారావు తనయుడు రాజా వెల్లడించారు. ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలోనే వెళ్లాలి, సొంత వెహికిల్ కూడా లేదని రాజా తెలిపారు.

నాగార్జున, వెంకటేష్ చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఆడుకునే వాళ్లం
మద్రాసులో ఉన్నపుడు నాగార్జున, వెంకటేష్ తో స్నేహం ఉండేది. మేమంతా కలిసి ఆడుకునే వాళ్లం. హైదరాబాద్ వచ్చినపుడు నాగేశ్వరావుగా బాగా చూసుకునే వారు. నాగార్జున, వారి అన్న, అక్కలు మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారం. అయితే ఇపుడు మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది... అని రాజా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇండస్ట్రీకి వచ్చినపుడు కాంతారావు చాలా రిచ్
రామారావుగారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించారు. కానీ కాంతారావుగారు ఇండస్ట్రీకి వచ్చే సమయానికే చాలా రిచ్. చాలా పొలాలు, భూములు ఉండేవి. ఆయనకు నాటకాల పిచ్చి ఉండేది. ఆ పిచ్చితోనే సినిమాల్లోకి వచ్చారు.... అని రాజా తెలిపారు.

ఐదు సినిమాలతో అంతా పోయింది
నాన్నగారు నటుడిగా కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆయన సినిమా నిర్మాణంలోకి రావడంతో మొత్తం లాస్ అయింది. ఐదు చిత్రాల నిర్మాణంతో తమ ఆస్తులన్నీ కరిగిపోయాయి అని రాజా తెలిపారు.

అప్పు ఉండొద్దని అంతా అమ్మేశారు
సినిమా నిర్మాణంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు. చివరకు అప్పులు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో 80 ఎకరాల భూమిని నాన్నగారు అమ్మేశారు అని... రాజా తెలిపారు.

వాణిశ్రీ సలహాతో మరింత చితికిపోయాం
అప్పటికే ఇండస్ట్రీ హైదరాబాద్కు మారిపోయింది. మద్రాసులో అవకాశాలు లేవు. ఆస్తులు కూడా పోయాయి. చివరకు ఇల్లు అమ్ముకుని ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని కుటుంబాన్ని నెట్టుకొద్దామనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చేశాం. ఆ సమయంలో వాణిశ్రీ గారు ఇచ్చిన సలహా ఫాలో కావడంతో మరింత చితికిపోయాం... అని రాజా తెలిపారు.

స్వాతి చినుకులు కన్నీటి చినుకులు మిగిల్చింది
వాణిశ్రీగారు వచ్చి మీరు మళ్లీ సినిమా తీయండి, అది బాగా ఆడుతుంది, మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, నాదీ పూచీ అంటూ మళ్లీ నిర్మాణంలోకి నాన్నగారిని దింపారు. దిగిన తర్వాత మాకు అన్నీ కష్టాలే. ‘స్వాతి చినుకులు' తీశాం... ఆ సినిమా మాకు కన్నీటి చినుకులు మిగిల్చింది అని రాజా తెలిపారు.

సినిమా అమ్మి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది
‘స్వాతి చినుకులు' సినిమాకు వాణిశ్రీగారే ఫైనాన్స్ ఇప్పించారు. ఆ సినిమా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్కు ఇవ్వమన్నారు. అదే మేము చేసిన తప్పు. సినిమాను అమ్మేసి ఉంటే మా డబ్బులు మాకు వచ్చేవి. ఆ సినిమా బాగా ఆడినా మాకు డబ్బులు తిరిగి రాలేదు అని రాజా తెలిపారు.

నాన్నగారి మంచితనం కూడా దెబ్బతీసింది
నాన్నగారి మంచి తనం కూడా కొంత దెబ్బతీసింది. ఆయనకు కథ కూడా చెప్పేవారు కాదు. మీరే హీరో అని చెప్పి సెకండ్ హీరోగా చేయించేవారు. అయినా నాన్న అడ్జెస్ట్ అయి చేసేవారు అని రాజా తెలిపారు.

నాన్నను ఇలా చేశారే అని బాధ ఉంది
మా నాన్న గారి టాలెంటును తొక్కేసారు అని నేను చెప్పు ఇపుడు చెప్పకూడదు. కానీ ఆయనకు అన్యాయం జరిగింది అని బాధ పడుతుంటాను..... అని రాజా తెలిపారు.

సుబ్బిరామిరెడ్డి సహాయం చేశారు
నాన్నగారు క్యాన్సర్తో ఆసుపత్రిలో ఉన్నపుడు సుబ్బిరామిరెడ్డిగారు రూ. 5 లక్షలు ఇల్లు కొనుక్కోండి అని గిఫ్టుగా ఇచ్చారు. నాన్నగారి ఆసుపత్రి ఖర్చులు అపుడు 8 లక్షలు అయ్యాయి. అలా ఆ డబ్బుతో పాటు, తమ వద్ద ఉన్న డబ్బు కూడా కరిగిపోయింది అని రాజా తెలిపారు.

సొంత ఇంటికి భూమి ఇవ్వాలని కోరుకుంటున్నాం
తెలంగాణ నుండి తొలి తరం హీరో కాంతారావు. మద్రాసు నుండి హైదరాబాద్ ఇండస్ట్రీ షిప్టయినపుడు ఆర్టిస్టులందరికీ భూములు ఇచ్చారు. కానీ నాన్నగారికి ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు భూమి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అది ఒక్కటే అని రాజా తెలిపారు.


Click it and Unblock the Notifications











