నాగార్జున సినిమా కోసం హైదరాబాద్ వచ్చి మరణించిన నటి
హైదరాబాద్: ప్రముఖ మళయాలం నటి కల్పన ఇక లేరు. ఒకప్పుడు హీరోయిన్ గా, ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై తన పరంపరను కొనసాగిస్తున్న ఆమె సోమవారం ఉదయం కన్నమూసారు.
నాగార్జున, కార్తి హీరోలుగా తెరకెక్కుతున్న తెలుగు, తమిళం ద్విబాషా చిత్రం ‘ఊపిరి' షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ఈచిత్రంలో ఆమె నాగార్జున తల్లి పాత్ర పోషిస్తోంది. షూటింగ్ అనంతరం ఆమె ఓ హోటల్ లో బస చేసారు. గదిలో అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆమె సోదరి ఊర్వశి కల్పన భౌతిక కాయాన్ని కేరళ తీసుకెళ్లేందుకు హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం.
కల్పన నటించిన చివరి చిత్రం మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వంలో వచ్చిన మళయాం చిత్రం ‘చార్లి'. ఈచిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో ఆమెది ప్రదాన పాత్ర కాక పోయినా...ఇందులో ఆమె క్యాన్సర్ పేషెంటుగా అద్భుతమైన నటన కనబర్చారు. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది.
కల్పన పూర్తి పేరు కల్పన రంజిని. 1983లో మళయాల సినిమాల ద్వారా తెరంగ్రేటం చేసారు. ఇప్పటి వరకు ఆమె మళయాలం, తమిళం ఇలా పలు బాషల్లో దాదాపు 300 చిత్రాలు చేసారు. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. 2012లో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
మళయాలం ఫిల్మ్ డైరెక్టర్ అనిల్ ను పెళ్లాడిన ఆమె 2012లో ఆయనో విడిపోయారు. ప్రస్తుతం ఆమె తన కూతురుతో కలిసి ఉంటోంది.


Click it and Unblock the Notifications












