కేసీఆర్ సాబ్.. 'అజ్ఞాతవాసి' చూపిస్తాం రండి, స్పెషల్ 'షో': మరీ మరీ అడిగిన త్రివిక్రమ్!
పవన్ కల్యాణ్-కేసీఆర్ మధ్య భేటీ ఇటీవల చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆశ్చర్యపరచడమే కాదు ఆ ఇద్దరిపై పలు విమర్శలకు తావిచ్చింది. అవసరం ఏర్పడితే రాజకీయాలు ఎంతకైనా దిగజారుతాయనడానికి ఈ ఇద్దరే నిదర్శనమని పరోక్షంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు.
విమర్శల సంగతెలా ఉన్నా.. 'అజ్ఞాతవాసి'కి భారీ కలెక్షన్లు కావాలి. అందుకోసం గత కొద్ది రోజుల నుంచి చిత్ర యూనిట్ అన్ని ప్రయత్నాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతూ వస్తోంది. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలవడం విశేషం.

కేసీఆర్ కోసం 'స్పెషల్ షో'..:
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ల కోసం స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు స్వయంగా తెలిపారు.

కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు :
శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో త్రివిక్రమ్, నిర్మాత చినబాబు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా సినిమా చూసేందుకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. అలాగే సీఎం కేసీఆర్ను కూడా సినిమా చూడాల్సిందిగా మరీ మరీ అడిగినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్కువ 'షో'లకు అనుమతినిచ్చినందుకు కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.

కేసీఆర్ చూస్తారా?:
కేసీఆర్ను సినిమాకు ఆహ్వానించామని దర్శక నిర్మాతలు చెబుతున్నప్పటికీ.. ఆయన సినిమా చూస్తారని గ్యారంటీగా చెప్పలేం.
ఒకవేళ కేసీఆర్ గనుక సినిమా చూసి పాజిటివ్ గా స్పందిస్తే.. పవన్ కు ఆయనకు మధ్య దోస్తీ కుదిరిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తడం ఖాయం. కాబట్టి కేసీఆర్ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారా? అన్నది అనుమానమే.

విమర్శలు..:
మరోవైపు ప్రజలను దోచుకోవడానికే ఇలా ప్రభుత్వం దగ్గర అనుమతులు తెచ్చుకుని ఎక్కువ 'షో'లు వేయించుకుంటున్నారని ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ లాంటి వాళ్లు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ ను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయన విమర్శల పదును మరింత పెంచారు.

కాపీ వివాదంతో టెన్షన్:
అజ్ఞాతవాసికి సెన్సార్ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కాపీ వివాదం వెంటాడుతుండటం చిత్ర యూనిట్ ను కలవరపెడుతోంది. దానికి తోడు ట్రైలర్ విడుదల చేయకపోవడం అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాపీ వివాదంలో ఇరుక్కుపోతామన్న భయంతోనే ట్రైలర్ విడుదల చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అభిమానుల్లో అంచనాలు రెట్టింపు:
ఇక అభిమానుల విషయానికొస్తే.. ఇప్పటికే టికెట్ల కోసం వెంపర్లాట మొదలైపోయింది. మొదటి రోజు మొదటి ఆటకే సినిమా చూడాలన్న ఆత్రుత వారికి నిద్ర కూడా పట్టనివ్వడం లేదు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్ది సినిమాపై వాళ్లలో క్యురియాసిటీ మరింత ఎక్కువవుతోంది. ఇక ఈ రెండు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ అయితే అది కాస్త రెట్టింపవడం ఖాయం.


Click it and Unblock the Notifications











