అవార్డు నిజాయితీగా వచ్చింది.. ఫోన్ చేయలేదు.. డబ్బులు ఇవ్వలేదు.. అక్షయ్ కుమార్
రుస్తుం చిత్రంలో అద్భుత నటనకు గానూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఎప్పుడో రావాల్సిన అవార్డు ఇప్పుడు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటీవల కాలంలో అద్భుతమైన చిత్రాలతో అక్షయ్ కుమార్ ఉత్తమ నటనను ప్రదర్శిస్తున్నాడు. ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రం విమర్శల ప్రశంసలు అందుకొన్నది.

గర్వంగా ఉంది..
అవార్డు లభించిందన్న వార్త చాలా గొప్పది. దేశంలోని అత్యుత్తమ పురస్కారాల్లో ఫిలిం అవార్డులు చాలా ప్రతిష్థాత్మకమైనది. అవార్డు లభించడం పల్ల చాలా గర్వంగా ఉంది. చాలా నిజాయితీగా చెప్తున్నాను.. మొదట ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకొన్నాను. తర్వాత తెలిసింది వార్త నిజమైనదే అని.. దాంతో ఆనందంలో మునిగి తేలుతున్నాను అని అక్షయ్ స్పందించాడు.

కష్టానికి ప్రతిఫలమే అవార్డు
2016 సంవత్సరం ఎన్నో అనుభూతులను మిగిల్చింది. వాటి ఫలితాలు ఒక్కొక్కటి చేతికి అందుతున్నాయి. నేను పడిన కష్టానికి ప్రతిఫలమే నేషనల్ అవార్డు. ఈ స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ చిత్రాలు అందించానికి అవకాశం ఏర్పడింది అని ఖిలాడీ అక్షయ్ అన్నాడు

నిజాయితీగా అవార్డు గెలుచుకొన్నాను..
చాలా నిజాయితీతో ఈ అవార్డును గెలుచుకొన్నాననే మాట మాత్రం చెప్పగలను. అవార్డు ఇవ్వమని నేను ఎవరికీ ఫోన్ చేసి అడుగలేదు. ఎవరికీ డబ్బు ఆశచూపలేదు అని అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బాధపడిన రోజులున్నాయి..
ఎన్నో ఏళ్లుగా మంచి చిత్రాల్లో నటిస్తున్నాను. అయితే గొప్పవి అనుకున్న చిత్రాలకు గుర్తింపుకు నోచుకోకపోవడంపై బాధపడ్డాను. లేటుగా వచ్చిన లేటెస్ట్గా అవార్డు వచ్చింది. మొత్తానికి ఏదో ఒకటి వచ్చిందనే భావన కలుగుతున్నదని అక్షయ్ పేర్కొన్నారు.

ప్రియమైన సతీమణికి
రుస్తం చిత్రంలోని పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఈ అవార్డును నా తల్లిదండ్రులకు, ఫ్యామిలీ, ప్రధానంగా నా ప్రియమైన సతీమణికి అంకితమిస్తున్నాను. అవార్డుల షోలకు వెళ్లడం ఆపి అవార్డు తెచ్చుకొని ప్రయత్నం చేయి అని ఎప్పుడు ట్వింకిల్ జోకులు వేసేదని, ఇప్పుడు ఆమె మాటలకు అడ్డుకట్ట పడింది అని అక్షయ్ వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications











