అలనాటి తెలుగు సినీ హీరో రంగనాథ్ అనుమానాస్పద మృతి, ఆత్మహత్యనా?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, అలనాటి సినీ హీరో రంగనాథ్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన హైదరాబాదులోని కవాడీగుడాలో గల తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 66 ఏళ్లు.
ఆయన 300కు పైగా చిత్రాల్లో నటించారు 1949లో మద్రాసు (ఇప్పటి చెన్నై)లో జన్మించారు. కొంత కాలం ఆయన రైల్వే టీసిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. 1969లో ఆయన బుద్ధిమంతుడు ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో ఆయనకు గిరిబాబు చందన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు.

జమీందారు గారి అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందమే ఆనందం వంటి పలు హిట్ సినిమాల్లో నటించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్గా నటించారు. 2014లో ఆయన శ్రీ కన్యకాపరమేశ్వరి చరిత్ర చిత్రంలో నటించారు.
శాంతినివాసం, ఇద్దరు అమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో వంటి టీవీ సీరియళ్లలో కూడా ఆయన నటించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వంటగదిలో ఉరేసుకుని చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయన భార్య శారీరకంగా వికలాంగురాలు. ఆమెకు సేవలు చేస్తూ ఉండేవారు. ఆమె మృతి చెందినతర్వాత రంగనాథ్ డిప్రెషన్కు గురైనట్లు చెబుతున్నారు. తన భార్య మృతిని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన వ్యక్తిత్వం ఆయనది కాదని కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











