అంజలి 'అదృశ్యం' ఓ నాటకం??...బిహైండ్ స్టోరీ(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: గత ఐదు రోజులుగా ఎక్కడ విన్నా అంజలి చర్చే. ఐదురోజులపాటు ఉత్కంఠకు గురిచేసి నాటకీయ ఫక్కీలో పోలీసుల ముందు ప్రత్యక్షమైంది ఆమె. అయితే అంజలి అజ్ఞాతవాసంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను బస చేసిన హోటల్ను వదిలి ముంబయికి వెళ్లినట్లు పోలీసులకు అంజలి చెప్పింది.
అయినప్పటికీ.. ఆమె అసలు అక్కడికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇన్నిరోజులు ఆమె హైదరాబాద్లోనే ఉన్నారని, ముగ్గురు నిర్మాతలు ఆమెకు అండదండలు అందించారని సమాచారం. అంజలి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులపైనా సదరు నిర్మాతల ద్వారా కొందరు మంత్రుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది.
అయితే కుటుంబ సమస్యల కారణంగా కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులను ఇబ్బంది పెట్టానని, అందుకు క్షమించాలని సినీనటి అంజలి కోరారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో ఆమె 'అదృశ్యం' కథ ముగిసింది. కానీ మిస్టరీ వీడలేదు.
అసలేం జరిగింది... బిహైండ్ స్టోరీ ఏంటి అనేది....స్లైడ్ షోలో..

విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. తమిళ సినిమాల్లో నటించాలంటూ అంజలిపై ఆమె బాబాయి సూరిబాబు, పిన్ని భారతీదేవి ఒత్తిడి తెచ్చేవారు.

అంజలి మాత్రం తెలుగు సినిమాల్లో నటించటానికి మొగ్గు చూపేవారని సమాచారం. తెలుగు సినిమాల్లో పారితోషికం ఎక్కువగా లభిస్తుండటమే దీనికి కారణమని తెలిసింది.

పిన్ని, బాబాయిల జోక్యం ఎక్కువ కావటంతో వారి నుంచి విడిపోయేందుకు అంజలి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారితో గొడవపడి సోమవారం హోటల్ గదిని వదిలిపెట్టి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.

తనకు గాడ్ఫాదర్గా ఉన్న ఒక నిర్మాతను ఆశ్రయించారు. ఆ నిర్మాత ఆమెను హైదరాబాద్లోనే ఒక అజ్ఞాతప్రాంతంలో ఉంచారు.

ముందుగా అనుకున్న ప్రకారం ఆమె బుధవారం (ఈ నెల 10న) బెంగళూరులోని 'బోల్బచ్చన్' సినిమా రీమేక్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అప్పటికే ఆమె 'అజ్ఞాతంలోకి' వెళ్లి రెండు రోజులయినా.. నిర్మాత స్రవంతి రవికిషోర్ ఆమె షూటింగ్లో పాల్గొంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ, అంజలి షూటింగ్లో పాల్గొనలేదు. అంజలి కనిపించకపోవటంపై సినీ పరిశ్రమలో చర్చలు, టీవీఛానళ్లు, పత్రికల్లో కథనాలు వచ్చాయి. దాంతో ఆమెను దాచిపెట్టిన నిర్మాత సూప్ లో పడ్డారు.

అంజలి సంరక్షణ బాధ్యతలు చేపట్టిన ఆ నిర్మాత ఎక్కువ కాలం ఆమెను అజ్ఞాతంలో ఉంచితే అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో అంజలిని పోలీసుల ఎదుట హాజరుపర్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నిర్మాత తన సోదరుడితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

అంతేకాదు ఆ నిర్మాత మరో ప్రముఖ నిర్మాత సహాయం కోరారు. రాజకీయాల్లో పలుకుబడి, ఇద్దరు మంత్రులతో సన్నిహిత సంబంధాలున్న సదరు నిర్మాత అంజలిని పోలీసుల వద్దకు తీసుకెళ్తానని చెప్పారు.

ఒక మంత్రి సహాయంతో పోలీస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అంజలి ముక్తసరి సమాధానాలు ఇస్తారని ముందుగానే తెలియజేశారు. ఈ మేరకు ఆ నిర్మాతకు చెందిన మేనేజర్ ఒక కారులో అంజలిని హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయానికి శుక్రవారం తీసుకువచ్చారు.

అంజలి వస్తున్నట్లు డీసీపీకి తెలియకపోవడంతో ఆయన ఇంట్లో ఉన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రాత్రి కార్యాలయానికి వచ్చారు. మీడియా హడావిడి చూసిన అనంతరం.. రిపోర్టర్ల ప్రశ్నలకు అంజలి నిజం చెబుతారేమోనన్న అనుమానంతో సుమారు రెండు గంటలపాటు విచారణ పేరుతో గదిలోనే ఉంచినట్లు సమాచారం.

అర్ధరాత్రి బయటకు తీసుకువచ్చి మీడియాతో ముక్తసరిగా మాట్లాడించారు. అనంతరం ఆమె బస చేసిన చోటుకు కాకుండా మరో నిర్మాతకు సంబంధించిన అతిథి గృహానికి వెళ్లిపోయారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికల ప్రతినిధులు వెంటాడుతున్నారని తెలుసుకుని దిశ మార్చి వెళ్లారు. ఈ విధంగా పలు మలుపులు తిరిగింది.

అంజలి అదృశ్యం వ్యవహారంపై పోలీస్ అధికారులను ప్రశ్నించగా.. మిస్సింగ్ కేసు నమోదైనందున ఆమె తిరిగి వచ్చారా లేదా అన్న అంశాన్నే పరిశీలిస్తాం తప్ప వ్యక్తిగత వ్యవహారాలు పట్టించుకోమని సమాధానం ఇచ్చారు. అంజలి అదృశ్యం కేసు చిక్కుముడి వీడడంతో ఆమె పోలీసులకిచ్చిన వాంగ్మూలంతోపాటు కేసు డైరీని జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.


Click it and Unblock the Notifications











