ప్రభాస్ డైరక్టర్ కు యాంటిసిపేటరీ బెయిల్
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా నటించిన 'రెబల్' వివాదం ఇప్పుడిప్పుడే తేలేటట్లు కనపడటం లేదు. ఆ వివాదం లో భాగంగా ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ కు కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అయితే హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కనపడమని ఆర్డర్ వేసింది. 'రెబల్' చిత్రం నిర్మాతలు భగవాన్, పుల్లారావు ల వాదన ప్రకారం... లారెన్స్...ఆ చిత్రం బడ్జెట్ ని 22.5 లో పూర్తి చేస్తానన్నారు. అంతేకాకుండా అంతకు మించి ప్రొడక్షన్ కాస్ట్ కనుక పెరిగితే తాను భరిస్తానని ఎగ్రిమెంట్ రాసి సంతకం చేసారు. ఆ చిత్రం బడ్జెట్ దాదాపు 40 కోట్లు అయింది.
అంతకు ముందు ఏం జరిగిందంటే...
చిత్ర నిర్మాణ వ్యయం అదుపు తప్పడానికి కారణం దర్శకుడు లారెన్స్ అని ఆ చిత్ర నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసారు. ఈ వివాదంపై నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ని మీడియా కలిసింది. ఆయన మాట్లాడుతూ ''మా ముందుకి నిర్మాతల ఫిర్యాదు వచ్చింది. ఖర్చు పెంచడం వల్లే నష్టం వాటిల్లిందని వారు స్పష్టం చేశారు. హిందీ హక్కుల్ని తన ప్రమేయం లేకుండా ఇచ్చేశారని దర్శకుడు అంటున్నారు. దీనిపైన నిర్మాతలూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలి, దర్శకుల సంఘం సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి చర్చలు సాగిస్తున్నాము'' అన్నారు.

నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావులు తెలుగు నిర్మాతల మండలికి చేసిన ఫిర్యాదులో రూ.22.5 కోట్ల వ్యయంతో రూపొందిస్తానని దర్శకుడు లారెన్స్ ఒప్పంద పత్రం రాశారనీ, అయితే చిత్ర నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.40 కోట్లు ఖర్చయిందనీ వారు తెలిపారు. మరో వైపు లారెన్స్ 'రెబల్' నిర్మాతలపై దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా ఆ చిత్రానికి సంబంధించిన రీమేక్, అనువాద హక్కుల్ని నిర్మాతలు అమ్మినట్లు తెలిపారు.
లారెన్స్ దర్శకత్వంలో విడుదలైన రెబెల్ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అప్పటికీ సినిమా లెంగ్త్ ఎక్కువైందని ట్రిమ్ చేసి వదిలినా ఫలితం లేకుండా పోయింది. మాస్ పేరుతో తన అరవ పైత్యాన్ని లారెన్స్ చూపించాడంటూ అంతటా విమర్శలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ సినిమా నిమిత్తం బాగా నష్టపోయినట్లు సమాచారం. వారు తమ డబ్బు రిఫెండ్ చేయాలని నిర్మాతపై వత్తిడి తెస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ నేపధ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
ఇక లారెన్స్ తాజా చిత్రం గంగ విషయానికి వస్తే...
దెయ్యం కథలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్. 'ముని'.. ఆ తర్వాత వచ్చిన 'కాంచన' (ముని-2) లారెన్స్ ప్రతిభకు అద్దంపట్టాయి. మాస్ కమర్షియల్ చిత్రాలతోపాటు హర్రర్ సినిమాలతో కూడా ప్రేక్షకులకు ఆశ్చర్యం, హాస్యాన్ని కూడా కలుగజేస్తారని చాటారు. ఇప్పుడు మూడో కొనసాగింపును కూడా సిద్ధం చేశారు. ఇందులో తాప్సి, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ లారెన్స్ హీరోగా కనిపించనున్నారు. కోవై సరళ, శ్రీమాన్ నటిస్తున్నారు.
లారెన్స్ మాట్లాడుతూ.. ''రానున్న నాలుగో తేదీన క్లెమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించనున్నాం. 20 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుంది. దీంతో మొత్తం పూర్తవుతుంది. గ్రాఫిక్ సన్నివేశాలు జోడించడం కోసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇటీవల అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవడంతో సినిమా ఆలస్యమైంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. 'కాంచన' మాదిరిగా ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటుంది''అని వివరించారు.
చిత్రం గురించి హీరోయిన్ తాప్సీ మాట్లాడుతూ... నేను 'ముని 3'లో నటిస్తున్నా. అదీ.. హారర్ సినిమానే. నటిస్తున్నానన్న మాటేగానీ, ఈసినిమా విడుదలైనా నేను చూడను. ఎందుకంటే... నాకు అంత భయం'' అని చెబుతోంది.
''నిజ్జం.. దెయ్యాలున్నాయి. నేను చూడలేదు గానీ, నా స్నేహితుల అనుభవాలు వింటే నిజమే అనిపిస్తుంటుంది. కొంతమంది ఏ కారణం లేకుండా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటారు. దాన్ని ఏమనాలి?? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా..? దైవ శక్తిని నమ్మినప్పుడూ దుష్ట శక్తినీ నమ్మాల్సిందే. అందుకే నేను ఈ తరహా సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడను.
అర్థరాత్రి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు, తలుపులన్నీ మూసేసి, టీవీలో హారర్ సినిమాల్ని చూడడంలో.. ఓ వింతైన అనుభవం దాగుంటుంది. భయపడుతూనే ఆ అనుభవాన్ని ఆస్వాదించడం ఓ సరదా అలవాటు. అందుకే హారర్ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. మీరూ దెయ్యాల సినిమాల్ని చూస్తుంటారా? అని తాప్సిని అడిగితే ఏం చెప్పిందంటే - ''అమ్మో.. హారర్ సినిమాలా? నాకు చాలా భయం. ఒకసారి ఓ సినిమా చూశానంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సినిమానే మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది. అందుకే.. వాటి జోలికి అస్సలు వెళ్లను..'' అంటోంది. దెయ్యాల టాపిక్ అనేసరికి చాలా విషయాలే మాట్లాడింది.


Click it and Unblock the Notifications











