యూటర్న్ తీసుకున్న అశ్వినీదత్.. వారి నిర్ణయమే, నా నిర్ణయం అంటూ క్లారిటీ!
సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ పైన అలాగే కొందరు నిర్మాతల పైన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు ఏర్పాటు అయిందో తెలియడం లేదని పేర్కొనడమే కాక టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్లు సినిమాలకు ఇబ్బంది అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

సీతారామం
ఒకరకంగా ఇప్పుడు థియేటర్ కి ప్రేక్షకులను రప్పించడం దర్శకులకు సవాల్ గా మారిందని ప్రముఖ నిర్మాత సినీ అశ్వినీదత్ పేర్కొన్నారు. నిర్మాణ వ్యయాలు ఎక్కువయ్యాయి అంటూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి టికెట్ ధరలు పెంచుకున్నారు కానీ ఇప్పుడు ఆ ధరలు తగ్గించామని ఒకసారి పెంచామని ఒకసారి చెప్పడం వల్ల సినిమాలపై ప్రేక్షకులలో విరక్తి కలిగిందంటూ ఆయన పేర్కొన్నారు. అంతేకాక హీరోల మార్కెట్ బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది కానీ సినిమా వ్యయం ఎక్కువ అయిపోతుంది అంటూ వాళ్ళను రెమ్యూనిరేషన్ తగ్గించుకోవాలని అనడం కరెక్ట్ కాదని అన్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై ఆయన నిర్మించిన సీతారామం అనే సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

పద్ధతి లేకుండా
ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కించారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన తాజాగా సినీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి గల కారణాలు అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు ఒక పద్ధతి లేకుండా పెంచడం, తగ్గించడం వల్ల సినిమాలపై ప్రేక్షకులలో విరక్తి కలిగిందని ఆయన అన్నారు.

నిర్మాతల శ్రేయస్సు కోసమే
ముందు నుంచే ఒక సెక్షన్ ప్రజలు ధియేటర్ కు రావడం లేదని కొందరు చాలా థియేటర్లను చేతుల్లోకి తీసుకుని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రావాలంటే భయపడే స్థాయికి తీసుకు వెళ్లారని అన్నారు. అలా టికెట్ ధరల పెంచటానికి కారణమైన వాళ్లే ఇప్పుడు స్టూడెంట్స్ బంద్ అంటూ ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. అసలు షూటింగ్స్ బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న నిర్మాతల్లో స్థిరత్వం లేదని చెప్పుకొచ్చారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటయింది. కానీ అప్పటి కౌన్సిల్ కి ఇప్పటికీ చాలా తేడా ఉందని అన్నారు.

క్లారిటీ
అంతేకాక అసలు ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చారు. అసలు సినిమా టికెట్ ధరలు పెంచాలా? వద్దా? పెంచితే ఎంత పెంచాలి అనే విషయాలు నిర్ణయించాల్సింది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఇక్కడ హీరోలకి పనిలేదు కానీ టికెట్ ధరల విషయంలో హీరోలు వెళ్లి మాట్లాడడం వల్ల తప్పుడు సంకేతాలు అందాయని ఆయన అభిప్రాయపడ్డారు. కోట్లకు కోట్లు దోచేయడం కోసమే టికెట్ ధరలు పెంచారనే ఆలోచనలు ప్రేక్షకులలో మొదలయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యల మీద ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సంపూర్ణ మద్దతు
నిర్మాతల నిర్ణయం తన నిర్ణయమే అని చెప్పుకొచ్చారు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నానని పేర్కొన్న ఆయన నా తోటి నిర్మాతలు అందరితో చాలా సన్నిహితంగా ఒక మంచి సోదర భావంతో మెలిగానని, ఇప్పటికీ ఏ నిర్మాత పైన తనకు అగౌరవం లేదని చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అయినా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అయినా సరే నిర్మాతలు చిత్ర పరిశ్రమ శ్రేయస్సు కోసమే ఉద్భవించాయని పరిశ్రమ కోసం అందరూ ఒక తాటిపై నడిచి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది తన అభిప్రాయం అంటూ ఆయన వ్యక్తం చేశారు. సినీ నిర్మాతలు అందరూ కలిసి చిత్రసీమ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అశ్వినీదత్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











