‘శ్రీమన్నారాయణ’ఆడియో విడుదల విశేషాలు
హైదరాబాద్: ''సమాజంలోని సంఘటనల్నీ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కథను తీర్చిదిద్దారు దర్శకుడు. ప్రతి పౌరుడూ స్పందించేలా భావోద్వేగాలుంటాయి. ఇంత బరువైన పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నేను వైవిధ్యంగా చేసిన ప్రతి ప్రయత్నాన్నీ ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని, వారికి నచ్చేలా తీర్చిదిద్దాం. చక్రి అందించిన పాటలు అందర్నీ అలరిస్తాయి''అన్నారు. ఆయన తాజా చిత్రం 'శ్రీమన్నారాయణ' ఆడియో విడుదల సందర్భంగా పై విధంగా మాట్లాడారు.
అలాగే ''నా సినీ జీవితంలో రకరకాల పాత్రలు చేశాను. మొదటిసారి ఇందులో పాత్రికేయుడిగా కనిపిస్తున్నాను. సాహసం, నిజాయతీ కలబోసిన వ్యక్తి కథ ఇది'' అన్నారు నందమూరి బాలకృష్ణ.'శ్రీమన్నారాయణ' సినిమాలోని పాటలు సోమవారం రాత్రి హైదరాబాద్లో విడుదలయ్యాయి. తొలి సీడీని బాలకృష్ణ విడుదల చేసి నటుడు సునీల్కి అందజేశారు. పార్వతి మెల్టన్, ఇషాచావ్లా హీరోయిన్స్ . రవికుమార్ చావలి దర్శకత్వం వహించారు. రమేష్ పుప్పాల నిర్మాత. చక్రి సంగీతం సమకూర్చారు.
'చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు... కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు', 'అనంతపూర్ సప్తగిరి సెంటర్లో అయినా, కర్నూలు కొండారెడ్డి బురుజులోనైనా... విజయవాడ బెంజి సర్కిల్లో అయినా...' అంటూ చిత్రంలోని సంభాషణల్ని వేదికపై బాలకృష్ణ పలికారు. '2010లో సింహావతారం. 2011లో రామావతారం. ఇప్పుడు శ్రీమన్నారాయణను చూపించబోతున్నారు బాలకృష్ణ'' అన్నారు బోయపాటి శ్రీను.
కృష్ణంరాజు మాట్లాడుతూ - ''ఈ సినిమా ఓపెనింగ్ నా చేతుల మీదే జరిగింది. ఏ అవాంతరాలు లేకుండా ఈ సినిమా పూర్తవడానికి కారణం బాలకృష్ణ. అలాంటి హీరో దొరకడం ఈ నిర్మాత అదృష్టం. 'శ్రీమన్నారాయణ' అనగానే పెద్దాయన గుర్తుకొస్తారు. నారాయణ అన్నా, రాముడన్నా ఆయనే. బాలకృష్ణ కూడా ఆయన స్థాయికి వెళ్ళాలి'' అని అన్నారు. తెలుగుదనానికి తెగులు పడుతున్న ఈ రోజుల్లో తెలుగుని తెలుగుగా పలికే ఏకైక హీరో బాలకృష్ణ అని కోట శ్రీనివాసరావు అభివర్ణించారు.
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ తండ్రీకొడుకుల్ని చూసి అభిమానులు ఆనందానుభూతులకు గురయ్యారు. ఈ సినిమాలో ఓ పాటకు వేదికపై చక్రితో కలిసి బాలకృష్ణ స్టెప్ వేయడం అభిమానులను హుషారుపరిచింది. ఈ వేడుకలో ఇంకా నందమూరి రామకృష్ణ, యలమంచిలి సాయిబాబా, బి. గోపాల్, డి. సురేష్బాబు, బెల్లంకొండ సురేష్, అంబికా కృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, శివలెంక కృష్ణ ప్రసాద్, అచ్చిరెడ్డి, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, చక్రి, సునీల్, ఇషా చావ్లా, చంద్రబోస్, ఘటికా చలం, శ్రీవాస్ తదితరులు మాట్లాడారు.


Click it and Unblock the Notifications











