చాలా సార్లు ట్రెండ్ను సృష్టించా: బాలకృష్ణ
"ఇప్పటికే మేము చాలాసార్లు ట్రెండ్ను సృష్టించాం. దాన్ని ఇతరులు అనుసరిస్తున్నారు" అని బాలకృష్ణ అన్నారు. మంచు మనోజ్ కాంబినేషన్లో శేఖర్ దర్శకత్వంలో మోహన్బాబు సమర్పణలో మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న 'ఊ కొడతారా... ఉలిక్కి పడతారా' చిత్రం ఆడియో వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఆడియో సీడీని దాసరి ఆవిష్కరించి, తొలిప్రతిని బాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
"అలాగే..నాన్నగారు తన సినిమా జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. విజయాల్ని అందుకొన్నారు. ఆయన దారిలో నడిచే అవకాశం ఇప్పుడు నాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. మేం మాట్లాడుతుంటే అందరూ వూ కొడుతున్నారు. ఈ సినిమాని చూశాక మాత్రం ఉలిక్కిపడతారు. ఇలాంటి పాత్ర చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా సినిమాల్నుంచి అభిమానులు ఏమేం ఆశిస్తారో... అందుకు భిన్నంగా సాగుతుందీ చిత్రం. ఈ సినిమా తప్పకుండా ఒక ట్రెండ్ను సృష్టిస్తుంది. ఈ సినిమా చేయడం నా అదృష్టం. చాలా వైవిధ్యమైన పాత్ర ఇది. నాకు ఒక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ తప్ప ఎలాంటి డ్యూయెట్లూ ఉండవు" అన్నారు బాలయ్య.
మోహన్ బాబు మాట్లాడుతూ... "ఇందులో బాలకృష్ణ చేసిన పాత్ర చూసి నాకే అసూయ కలిగింది. 'పెదరాయుడు' లాంటి పాత్ర అది. ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ లక్ష్మీప్రసన్న సంస్థ మొదలైంది. ఆ తర్వాత ఆయనతోనే 'మేజర్ చంద్రకాంత్' చేసే అదృష్టం దక్కింది. ఇప్పుడు బాలయ్య మా సంస్థలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంచలన విజయాలు సాధించిన బాలయ్య ఈ పాత్ర చేయడమంటే అది కేవలం నా బిడ్డ మీద ఉన్న అభిమానమే అనుకుంటాను. ఆ రోజు రామారావుగారు నన్ను ఆశీర్వదించినట్టుగానే, ఈ రోజు మనోజ్ని బాలయ్య ఆశీర్వదిస్తున్నాడు. తన ఆశీస్సులతో మనోజ్ నంబర్వన్ హీరో కావాలి" అని చెప్పారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''ఇదివరకు జరిగిన ఈ సినిమా వేడుకలో నేను వూ కొట్టానంతే. కానీ ఈ ప్రచార చిత్రాలు చూశాక నిజంగా ఉలిక్కిపడ్డాను. మనోజ్, బాలకృష్ణ కలిసి నటిస్తున్నారని తెలిశాక కూడా నాకు అదే అనుభూతి కలిగింది. బాలయ్య ఈ సినిమాలో ఈ పాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా నాకు చెప్పాడు. తన స్ఫూర్తి నాకు నచ్చింది. నాకు తెలిసి కథానాయకులు ఎవ్వరూ చెయ్యలేని సాహసమిది. మోహన్బాబు తనయులు విష్ణు, మనోజ్ ఇంకా చేరాల్సిన స్థాయికి చేరలేదు. మనోజ్ ఈ సినిమాతో ఒక మంచి స్థాయికి చేరతాడన్న నమ్మకం నాకుంది''అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, రాఘవేంద్రరావు, బి.గోపాల్, నాని, శర్వానంద్, తాప్సి, దీక్షాసేథ్, వీరుపోట్ల, వంశీ పైడిపల్లి, నిఖిల్, రాజా, పంచిబోరా, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.


Click it and Unblock the Notifications











