హాట్ టాపిక్: ‘రాంబాబు’కి వివాదం కలిసి వస్తుందా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పై తెలంగాణలో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఈ వివాదం కలిసి వచ్చే అవకాసం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. పెద్ద బాగోలేదంటగా.. తర్వాత చూద్దాంలే అనుకునే వారు సైతం ఇప్పుడు వెంటనే చూద్దామనుకుంటున్నారు. ఈ చిత్రం మీడియాలో ఒక్కసారి హాట్ గా మారటంతో అందరికి ఆసక్తి కలిగింది. ఈ నేపధ్యంలో గతంలోనూ వివాదం క్రియేట్ చేసిన సినిమాలు భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పుంజుకున్న సంగతి చర్చలోకి వస్తోంది. అయితే కొందరి మనోభావాలు దెబ్బతీస్తూ వివాదాలతో సినిమాలు గట్టెక్కాలనుకోవటం మాత్రం సరైన పద్దతి కాదనేది అందరూ ఒప్పుకునే సత్యం.
ఇక ఈ సినిమా వివాదం ఇప్పటికే హెచ్ఆర్సీ మెట్లెక్కింది. సినిమాలోని సన్నివేశాలు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని, తెలంగాణ ప్రజల మనోః భావాలను దెబ్బ తీసే విధంగా సినిమాను చిత్రీకరించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేతలు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సీ ఈనెల 30లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ డీజీపీ, సెన్సార్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. చిత్ర ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, చిత్ర దర్శకుడు, నిర్మాతలపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డెరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో పవన్కళ్యాణ్పై తెలంగాణవాదులు ఫైర్ అయ్యారు. పైసల పైత్యంతో ఒళ్ళు బలిసి ఈ సినిమా తీశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమనేతలపై పూరీ జగన్నాథ్ పరోక్షంగా సమైక్య విషం కక్కారని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాను తీసిన పూరీజగన్నాథ్కు తగి బుద్ధి చెబుతామని సుమన్ హెచ్చరించారు. పూరీ జగన్నాథ్, పవన్కళ్యాణ్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా... తెలంగాణ వ్యాప్తంగా రాంబాబు సినిమాను నిలిపివేయాలని థీయేటర్ యజమానులకు టీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఇక తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా చిత్రీకరించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను నిలిపివేయాలని టీఆర్ఎస్ హెచ్చరించింది. ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా సినిమా రంగాన్ని వాడుకోవడం దురదృష్టకరమని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి జగదీష్రెడ్డి అన్నారు. తెలంగాణలో బలవంతంగా ఈ సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు దర్శక, నిర్మాతలే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సినిమాను అడ్డుకోవాలని టీఆర్ఎస్వీతో పాటు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.


Click it and Unblock the Notifications











