Don't Miss!
- News జనంలోనే జగన్: నియోజకవర్గాల్లో సభలు.. అక్కడే బస
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
కెటిఆర్ ఆ మాట అనగానే చివుక్కుమంది: చిరు, బాలయ్య అదుర్స్
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం సాయంత్రం తెలుగు సినీ సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్ తో పాటు సినీ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తెలుగు సినీ ప్రముఖులను ప్రభుత్వం తరుపున సన్మానించారు. అనంతరం సినీ తారలు తెలుగు గొప్పదనం గురించి, తెలుగు భాష తీయదనం గురించి మాట్లాడారు.
Recommended Video
కేటీఆర్ అలా అనగానే చివుక్కుమనిపించింది: చిరంజీవి
‘‘కేటీఆర్ గారూ ఈ మహాసభలకు పిలిచేందుకు తమ ఇంటికి వచ్చారని.. అయితే ఆయనకు అవార్డు వచ్చిన సందర్భంగా ఆ సమయంలో ఇంగ్లీష్లో విష్ చేశానని తెలిపారు. అయితే వెంటనే ‘అన్నా.. మనం తెలుగు వాళ్లం. స్వచ్ఛమైన తెలుగు కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన ఈ సందర్భంలో తెలుగులో మాట్లాడుకుంటే బావుంటుంది కదా..'' అని అనగానే నాకు ఒక్కసారిగా చివుక్కుమనిపించింది అని చిరంజీవి తెలిపారు.
వెంటనే క్షమాపణ చెప్పాను: చిరంజీవి
కేటీఆర్ అలా అనగానే నాలో ఆలోచన మొదలైంది. ఇద్దరు తెలుగు వాళ్లు ఎదురుపడినప్పుడు చక్కటి తెలుగు మాట్లాడకుండా.. ఆంగ్ల భాషని ఎందుకు వాడుతున్నాం అని అనిపించింది. వెంటనే ఆయనకి క్షమాపణ చెప్పేశాను. ‘‘లేదు అన్నా.. జస్ట్ జోకింగ్'' అని ఆయన అన్నప్పటికీ.. తమాషాగా అన్నా కూడా నాలో వెంటనే ఆలోచనని కలిగించింది... అని చిరంజీవి తెలిపారు.
తెలుగును బ్రతికిద్దాం: చిరంజీవి
నేను ఢిల్లీలో ఉన్నపుడు గమనించాను. హిందీ వాళ్లు హిందీలోనే మాట్లాడుకుంటారు. తమిళియన్స్ వారి భాషను ఎంతగానో ప్రేమిస్తారు. మన తెలుగు వాళ్లు మాత్రమే.. ఇలా ఆంగ్లంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది. తెలుగుని బ్రతికించలేమా? ఇకనైనా.. మనం తెలుగుని ప్రేమిద్దాం. తెలుగుని మనం పోషిద్దాం..తెలుగుని ముందుకు తీసుకువెళదాం. భావితరాలకు ఆస్థిగా మన తెలుగుని అందించాల్సిన బాధ్యత మనకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..'' అని చిరంజీవి అన్నారు.
కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం
‘తెలుగు'ను ఎందుకు గుర్తించాలి, గౌరవించాలి? అన్న దానితో పాటు దాని ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రంలో 1వ నుండి 12వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరి చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు... చిరంజీవి.
బాలయ్య ప్రసంగం అదుర్స్
తెలుగు మహా సభల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రసంగం ఆకట్టుకుంది. ‘ఎన్టిఆర్' అనే మూడు అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని..‘ తెలుగు' అనే మూడు అక్షరాలు వింటే తన తనువు పులకిస్తుందన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని బాలయ్య తెలిపారు.
మనవాళ్లకు డబ్బా పాల మీద మోజు పెరిగింది: బాలకృష్ణ
పూజ్య బాపూజీ ‘మాతృభాష తల్లిపాలు లాంటిది' అని ఒక గొప్ప మాట చెప్పారని, మన వాళ్లకు మాత్రం పరాయి భాష అనే డబ్బాపాలపై మోజు పెరిగిపోయిందని, అమ్మను అమ్మా అని, తండ్రిని డాడీ అని పిలిపించుకుంటున్నారని, పాతికేళ్లు పోతే, ‘మమ్మీ', ‘డాడీ' లే అచ్చమైన తెలుగు శబ్దాలు అయిపోయే ప్రమాదం ఉందని బాలకృష్ణ అన్నారు.
అద్భుతంగా వర్ణించిన బాలయ్య
ఈ సందర్భంగా బాలయ్య తెలుగు భాషను వర్ణించిన తీరు ఆకట్టుకుంది. ‘తెలుగుభాష ఎంతో రమణీయమైంది. కమనీయమైంది. తెలుగు భాషలో గోదావరి ఒంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరి నెరజాణ తనం, రాయలసీమ రాజసం ఉన్నాయి. తెలంగాణ మాగాణం తెలుగు భాష.. కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష' అటువంటి భాషను మనం మాట్లాడుకుంటున్నందుకు మనం గర్వపడాలి, అటువంటి జాతిలో పుట్టినందుకు మనం ఆనందించాలి, మన జాతిని, మన భాషను మనం గౌరవించాలి' అని బాలకృష్ణ అన్నారు. తెలుగు వారిని ఒకచోట చేర్చిన సీఎం కేసీఆర్ సహృదయత, భాషాభిమానానికి యావత్తు ఆంధ్రా, తెలంగాణ ప్రజానీకం తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని బాలయ్య అన్నారు.
మోహన్ బాబు
మోహన్ బాబు మాట్లాడుతూ, ‘దేశభాషలందు తెలుగు లెస్స' అని, ప్రతి ఒక్కరికీ దానిని జ్ఞాపకం చేయడం కోసం ఎంతో ఘనంగా ఈ సభలను నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కళాకారులను సన్మానిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం తాను లొకేషన్ చూడటానికి కాంచీ పురం వెళ్లానని, అక్కడ ఒక్కో లొకేషన్ చూస్తుంటే ఒక చోట చిన్న పిల్లలు చాలా మంది కూర్చుని తమిళం నేర్చుకుంటున్నారు. ఎంతుకంత ఇంట్రెస్టుగా నేర్చుకుంటున్నారు అని అడిగితే అది అక్కడ ప్రభుత్వం తరుపున స్కీమ్ అని చెప్పారు. తమిళంను చిన్న వయసు నుండి నేర్పించే ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది. అలాంటి స్కీమ్ ఇక్కడ కూడా ప్రవేశ పెడితే తెలుగుపై మమకారం మరింత పెరుగుతుందని తెలిపారు.
ఆర్ నారాయణ మూర్తి
దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి ఎప్పటిలాగే తనదైన రీతిలో ఆవేశంగా స్పీచ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ లపై ప్రశంసలు గుప్పించారు. తెలుగు భాషను కాపాడటానికి మరింత కృషి చేయాలన్నారు.