ఏ ఒక్క ప్రాణాన్ని పోనివ్వం: చిరంజీవి.. రాంచరణ్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు
కరోనావైరస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న భయంకర పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మెగాస్టార్ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు గురించి వివరాల్లోకి వెళితే..
Recommended Video
జాస్మిన్ భాసిన్ మైండ్ బ్లోయింగ్ హాట్ స్టిల్స్

పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు
చిరంజీవి అభిమాన సంఘాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల పర్యవేక్షణలో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ బ్యాంకులు ఆంధ్రాలోని అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి అని తెలిపారు.

ఏ ఒక్కరు మరణించొద్దు
తెలుగు రాష్ట్రాల్లోని ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరు మరణించకూడదనే సదుద్దేశంతో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశాం. కరోనా బాధితుల అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సిలెండర్లు, కాన్ సన్ట్రేటర్స్ పంపిణీ ఉంటుంది. ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆక్సిజన్ కొరత, సంక్షోభాన్ని నిలువరిస్తాం అని మెగా ఫ్యాన్స్ తెలియజేశారు.

ప్రత్యేకమైన ట్రాకింగ్ వ్యవస్థ
ఆక్సిజన్ బ్యాంకుల సేవల గురించి మరింత సమాచారం అందించడానికి సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించాం. ఆక్సిజన్ ట్యాంకర్ల ప్రయాణాన్ని ట్రాకింగ్ చేయడానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు నుంచి పర్యవేక్షణ కొనసాగుతుంది అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

రాంచరణ్ పర్యవేక్షణలో
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియను పూర్తి. చేశాం. నా కుమారుడు రాంచరణ్ ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ జిల్లాలోని ఆక్సిజన్ బ్యాంక్ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకొంటున్నారు అని చిరంజీవి తెలిపారు.

త్వరలోనే అన్ని జిల్లాలకు
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. కాన్ సన్ట్రేటర్స్ అత్యవసరంగా ఎక్కడ అవసరం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. త్వరలోనే అన్ని జిల్లాలకు ఈ సేవలను, బ్యాంకులను విస్తరిస్తాం అని చిరంజీవి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











