హీరో రాజశేఖర్ హిట్ చిత్రానికి ఊహించని షాక్, ప్రదర్శించకుండా ఆంక్షలు!
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'పిఎస్వి గరుడ వేగ' చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాను టీవీల్లో కానీ, యూట్యూబ్ లాంటి డిజిటల్ మాధ్యమంలో కానీ ప్రదర్శించడానికి వీల్లేదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ సినిమాను సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలో కూడా అప్లోడ్ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరక దర్శక నిర్మాతలకు, యూట్యూబ్ మేనేజ్మెంటుకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

కోర్టుకెక్కిన యూరేనియం కార్పొరేషన్
‘పిఎస్వి గరుడ వేగ' సినిమాలో ఇండియా నుండి ఉత్తర కొరియాకు న్యూక్లియర్ ముడి పదార్ధాలు యూరేనియం, ప్లూటోనియం, థోరియం అక్రమ రవాణా చేస్తున్న చూపించారు. దీంతో సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోర్టును ఆశ్రయించడంతో ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తమ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది
‘గరుడ వేగ' చిత్రం తమ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉందని, పరోక్షంగా యూరేనియం కార్పొరేషన్లో కుంభ కోణం జరిగినట్లు సినిమాలో చూపించారని, ఇందులో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లు చూపించారని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు.
Recommended Video


అందుకే అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి, జాడుగుట్టలో యూరేనియం ప్లాంట్ ఉందని, పరోక్షంగా దీన్ని ఫోకస్ చేస్తూ సినిమా చిత్రీకరించారని, గరుడ వేగ అనే నౌక ద్వారా ప్లూటోనియం, యూరేనియం, థోరియం అక్రమంగా తరలించినట్లు సినిమాలో ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు.

హోం మినిస్టర్, కార్పొరేషన్ చైర్మన్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా
యూరేనియం అక్రమ రవాణాలో హోం మినిస్టర్, యూరేనియం కార్పొరేషన్ చైర్మన్ ప్రమేయం ఉన్నట్లు సినిమాలో చూపించారని, ఇదంతా కూడా కొర్పొరేషన్ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా ఉందని వాదించడంతో కోర్టు ఈ సినిమా ప్రదర్శన నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విచారణ నాలుగు వారాలు వాయిదా
చిత్ర ప్రదర్శన నిలిపి వేయడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహించరాదని కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణ 4 వారాయిలు వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











